కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల గడువు ముగిసింది. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య బరిలోకి దిగే విషయంలోనూ ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఆయన రెండు నియోజకవర్గాల్లోనూ పోటీలో ఉంటున్నారు. చివరిరోజు బాదామి నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఆయన చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే సీఎం నామినేషన్ వేసిన బాదామి నియోజకవర్గం నుంచే బీజేపీ తరుపున ఎంపీ బీ శ్రీరాములు బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణ గడువు ఈనెల 27వరకు ఉంది. ఇప్పుడు బాదామిలో గాలి జనార్దన్రెడ్డి వర్సెస్ సిద్ధరామయ్యగా పోటీ ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
రెండో చోట కూడా సిద్దూ పోటీ చేస్తారని కొద్దిరోజులుగా అందరూ ఊహించినట్లుగానే ఆయన నామినేషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజకవర్గంలో ఓడిపోతారన్న భయంతోనే సిద్దూ బాదామి నుంచి కూడా బరిలోకి దిగుతున్నారనీ, ఆయన రెండు చోట్లా ఓడిపోవడం ఖాయమని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అయితే భాగల్కోట జిల్లా బాదామి నియోజకవర్గంలో కూడా మొదటి నుంచీ ఎవరిని బరిలోకి దించాలన్న విషయంలో బీజేపీ కూడా అయోమయంలోనే ఉంది.
కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే అభ్యర్థి ఆధారంగానే తమ అభ్యర్థిని ప్రకటించాలని ఇన్నిరోజులూ వేచి చూసింది. చివరకు అక్కడి నుంచి సిద్దూ బరిలోకి దిగడంతో ఆయనను దీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న గాలి జనార్దన్రెడ్డి వర్గానికి చెందిన శ్రీరాములును బీజేపీ రంగంలోకి దింపింది. బాదామిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదని ఇరువర్గాలు అంటున్నాయి. సిద్దూ ప్రస్తుతం వరుణ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే తనయుడు యతీంద్ర రాజకీయ భవిష్యత్ కోసం సిద్దూ వరుణ నియోజకవర్గాన్ని త్యాగం చేశారు.
చాముండేశ్వరి నియోజకవర్గంలో జేడీఎస్ బలంగా ఉంది. సామాజిక వర్గాల పరంగా చూసినా సిద్దూకు అంతగా మద్దతు కనిపించడం లేదు. అంతేగాకుండా గత ఎన్నికల్లో మైసూరు రాజవంశీయులు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. ఈసారి అమిత్షా రాజవంశీయులను కలిసి చర్చలు జరిపారు. దీంతో ఈసారి రాజవంశీయుల మద్దతు బీజేపీకే ఉంటుందని అంటున్నారు. ఇలా ఇంతటి క్లిష్ట పరిస్థితులు ఉన్న చాముండేశ్వరి నుంచే గాకుండా బాదామి నుంచి కూడా సిద్దూను బరిలోకి దించుతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇక్కడ సిద్ధరామయ్య వర్గానికి చెందిన కురుబ ఓటర్లు 60 వేల వరకు ఉన్నారు. ఇది సిద్ధరామయ్య కమ్యూనిటీకి కంచుకోట. దీంతో ఆయన ఇక్కడ ధైర్యంగా నామినేషన్ వేసి పోటీకి రెడీ అవుతున్నారు.