ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో రోజురోజుకూ వర్గపోరు ముదురుతోంది. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మల్యే, మాజీ ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు ఎసరు పెట్టేందుకు ఓ నాయకుడు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ సంపాదించాలన్న పట్టుదలతో ఆ నాయకుడు సరికొత్త ఎత్తుగడతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
స్టేషన్ ఘన్పూర్ నియోజవర్గంలో అవినీతి పెరిగిపోయిందనీ, దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫిర్యాదు చేస్తానని సన్నిహితులతో అంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మల్యే రాజయ్యకు ఎసరు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న నాయకుడు మరెవరో కాదు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారపు ప్రతాప్. నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పేరిట యాత్ర చేపట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెబుతున్నారు. నిజానికి ఆయన యాత్ర వెనుక వచ్చే ఎన్నికల్లో టికెట్ సంపాదించాలన్న లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్గా రాజారపు ప్రతాప్ను సీఎం కేసీఆర్ నియమించారు. అనంతరం కొద్ది రోజులకే రాజారపు ప్రతాప్ రాజీనామా చేయడం నియోజవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఇక రాజయ్యకు టికెట్ రాదనీ, రాజారపు ప్రతాప్కే అవకాశం ఉంటుందనీ, అందుకే సీఎం కేసీఆర్ ఆయనతో రాజీనామా చేయించారనే ప్రచారం జరిగింది. కొద్దికాలంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న రాజారపు ప్రతాప్ ఇక తనకే టికెట్ వస్తుందనీ, ఈ మేరకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారంటూ సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం.
ఇక ఇప్పటికే రాజయ్యకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని ఆయనను పక్కన పెట్టేస్తారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టుపై కన్నేసి నియోజకవర్గంలో గ్రిప్పింగ్ కోసం రాజారాపు ప్రతాప్ ప్రయత్నాలు చేస్తున్నట్టు క్లీయర్గా తెలుస్తోంది. తాజాగా... నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయంటూ సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేస్తానని చెప్పడం నియోజకవర్గంలో దుమారం రేపుతోంది. ఏదేమైనా ఎన్నికల వేళ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో అధికార పార్టీలో ముదురుతోన్న పొలిటికల్ వార్ ఇక్కడ వాతావరణాన్ని హీటెక్కిస్తోంది.