"మానసిక కుంగుబాటు" కు లోను కావద్దు: దీపిక పదుకొణే

ఒంటరితనం, ఎవరో ఏదో అంటున్నారని, వృత్తిగత వ్యక్తిగత వైఫల్యాలు, అపరాధభావం, జీవనశైలిలో కొత్తగా వస్తున్న మార్పులు అందుకోలేక పోతున్నాననే భావనలను దరిచేరనీయవద్దని, అవి మనిషిలో "మానసిక కుంగుబాటు-డిప్రెషన్‌" కు దారితీస్తుందని ప్రఖ్యాత బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణే పేర్కొన్నారు. ఆమే హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న "ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సు" లో బుధవారం "మానసిక దృఢత్వం" అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చలో ఆమె మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా మానసిక కుంగుబాటు అంటువ్యాధిలా మారుతోందని, ప్రతి ఐదుగురిలో ఒకరు తీవ్ర మానసిక వ్యధను ఎదుర్కొంటున్నారని చెప్పారు. సామాజిక చైతన్యమే కుంగు బాటుకు పరిష్కారమన్నారు. 


గతంలో స్వయంగా మానసిక కుంగుబాటుకులోనై తాను బయటపడ్డానని తన అనుభవాన్ని సభికులతో పంచుకున్నారు. "నా సినీ కెరీర్‌ మంచిస్థాయిలో ఉన్న 2014లో మానసిక కుంగుబాటుకు, తీవ్ర మనోవేదనకు గురయ్యా. ఒంటరితనంతో నాలో నేనే కుమిలిపోయా. బాధను తట్టుకోలేక ఏడ్చేదాన్ని. ఆ సమయంలో నా వద్దకు వచ్చిన మా అమ్మ నాకు అండగా నిలిచారు. మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పించారు. కుంగుబాటు నుంచి బయటపడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.." అని దీపికా పదుకొణే చెప్పారు.  


తన మానసిక పరిస్థితిని వస్తున్న మార్పులను  సామీప్యం నుండి గమనించిన తన తల్లి అడిగాకే, తనను ఇబ్బందిపెట్టిన విషయాలను వేరేవారితో పంచుకోవడానికి తనకు అవకాశం లభించిందని దీపిక పదుకొణే  చెప్పారు. నిత్యం మనతో కలిసి ఉండేవారు ఏం చెబుతున్నారో, వాళ్లలో వస్తున్న మార్పులేమిటో గమనిస్తూ ఉండాలని, వారిలోని చిరాకును గమనించాలని సూచించారు. వారిలో కుంగుబాటు లక్షణాలను గుర్తించి అండగా నిలవాలన్నారు. తనకు ఏమైందో తెలియని మనోవేదన అనుభవించానని, అది మానసిక కుంగుబాటు (డిప్రెషన్‌) అని మానసిక వైద్యులు నిర్ధారించిన మరుక్షణమే సగం విజయం సాధించానని చెప్పారు. 

మానసిక వైద్యులు, వారి సాహచర్యంలో కౌన్సెలింగ్, ధాన్యం, జీవనశైలి లో మార్పులు, సకాలంలో నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడంతో పాటు తల్లి అందించిన సహకారంతో మానసిక కుంగుబాటు నుంచి బయటపడ్డానని తెలిపారు. మానసిక ఆందోళన, ఆవేదన, వ్యధ, వేదించి వేటాదే అంశాలను మన శ్రేయస్సు కోరేవారితో పంచు కుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. 


Deepika Padukone and her mother Ujjala

మానసిక కుంగుబాటుకు ఎన్నో కారణాలు ఉంటాయని, అపరాధభావం అందులో ఒకటని దీపిక పదుకొణే చెప్పారు. తన గురించి ఎవరో ఏదో అనుకుంటారనే, తనను అప కీర్తి పాలు చేస్తారనే (జడ్జ్‌ చేస్తారనే భావన) భయంతోనే తాను కుంగుబాటుకు లోనయినట్లు తెలిపారు. మనోవేదనకు లోనైనప్పుడు ఏడవడం, మనసు విప్పి ఇతరులతో బాధను పంచుకోవడం, వైద్య సహాయం పొందడం మంచిదని సూచించారు. ప్రతి సంస్థ మానసిక నిపుణులతో తమ ఉద్యోగులకు తరచూ కౌన్సెలింగ్‌ ఇప్పించాలని కోరారు. తనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ‘ది లైవ్‌ లవ్‌ లాఫ్‌’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విప్రో సంస్థ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ సంధానకర్తగా వ్యవహరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: