ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ ఇప్పుడిప్పుడు రాజకీయంగా పట్టు సాధించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్కు ప్రపంచంపటంలో ఐటీ బ్రాండ్ ఇమేజ్ తేవడంతో చంద్రబాబు చేసిన కృషి గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ఐటీ శాఖకు మంత్రిగా ఉన్న లోకేష్ కూడా నవ్యాంధ్రకు అదే బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.
ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా ఉన్న లోకేష్ వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక సీటు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సీమ నుంచి మామ బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటే, లోకేష్ తండ్రి చంద్రబాబు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణి పోటీ చేస్తే గుంటూరు నుంచి ఎంపీగా రంగంలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
బాలయ్య, బాబు సీమ నుంచి, బ్రాహ్మణి రాజధాని ఏరియా నుంచి పోటీ చేస్తే ఇప్పుడు లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడనేదానిపై కొద్ద రోజులుగా రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో టీడీపీకి కంచుకోటగా ఉన్న పెనమలూరు నియోజకవర్గం నుంచి లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి...అందరూ లోకేష్ పెనమలూరు నుంచే పోటీ చేస్తాడని కూడా అనుకుంటున్నారు.
అయితే ఇప్పుడు చంద్రబాబు కొడుకు సీటు కోసం వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలు, తాజా పరిణామాలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. లోకేష్ వరుసగా ఏపీలో ఐటీ కంపెనీల ప్రతినిధులతో మీట్ అవుతూ 32 కంపెనీల కార్యకలాపాలు ప్రారంభించడంలో చాలా కృషి చేశారు. వచ్చే ఎన్నికలకు ముందుగానే ఏపీలో ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు వచ్చేందుకు ఆయన చాలా కష్టపడుతున్నారు.
ఇక `సిటీ ఆఫ్ డెస్టినీ`, నవ్యాంధ్రకు ఐటీ హబ్.. విశాఖపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇక లోకేష్ విశాఖలో ఐటీ క్లస్టర్ ప్రారంభించడంతో పాటు అక్కడ చాలా ఐటీ కంపెనీలు వచ్చేలా చూస్తున్నారు. ఇప్పటికే అక్కడ చాలా కంపెనీలు ప్రారంభమవ్వడంతో పాటు యువతకు ఉద్యోగాలు కూడా ఇస్తున్నాయి. దీని వెనక చంద్రబాబు వేసిన వ్యూహం ఏంటంటే లోకేష్ వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లా నుంచి పోటీ చేసేలా రోడ్ మ్యాప్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి.
మంత్రి గంటా వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లాలో మరో నియోజకవర్గానికి మారడం లేదా విజయనగరం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. లోకేష్ వీలునుబట్టి గంటా మారితే భీమిలి నుంచి పోటీ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. భీమిలి కాని పక్షంలో నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి కూడా లోకేష్ పోటీ చేసేలా అతడి ఎమ్మెల్యే సీటు కోసం రోడ్ మ్యాప్ వేస్తున్నారని టీడీపీ వర్గాల అంతర్గత సమాచారం.