దేశంలోనే అట్టుడికిన ఉత్తర ప్రదేశ్ బులంద్షెహర్ గ్యాంగ్రేప్ కేస్ పై అత్యంత కౄరమైన నాగరికత మరచి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి మహమ్మద్ ఆజంఖాన్ను సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఈ గ్యాంగ్రేప్ ఘటన నేపధ్యములో ప్రతిపక్షాల రాజకీయకుట్ర కోణం దాగి ఉందన్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆజంఖాన్ను ఆదేశించింది.
ఈ గ్యాంగ్రేప్ ఘటన రాజకీయకుట్ర అని, సమాజ్వాది పార్తీని, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వాన్ని బదనాం చేసేతందుకే ఈ కుట్రకు పాల్పడ్డారని ఆజంఖాన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపంలో ఉండటంతో ప్రతిపక్షాలు ఏస్థాయికైనా దిగజారుతాయని, అందువల్ల ఈ ఘటనలో రాజకీయ కుట్ర ఉందా? అన్న కోణంలో దర్యాప్తు జరుపాలని ఆయన అన్నారు.
యూపీలోని బులంద్షహెర్ సమీపంలో బందిపోటు దొంగలు ఓ కుటుంబంపై విరుచుకుపడి వారి డబ్బు, నగలను దోచుకున్నారు. అంతే కాకుండా ఆ కుటుంబంలోని పురుషులను తుపాకీతో బెదిరించి, ఒక మహిళ, ఆమె కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆజంఖాన్ వ్యాఖ్యలు, పోలీసు దర్యాప్తు తప్పుదారి పట్టించిన తీరును తప్పుబడుతూ బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో కేసు నమోదుచేసింది.