ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కొత్తరాజకీయాలకు తెరతీయబోతున్నది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రంలో క్షణ దశలో ఉన్నది. ఎలాగైనా పార్టీ తిరిగి బలపడాలని చూస్తున్నది. 2014కు ముందు ఏపీకి పీసీసీ చీఫ్ గా రఘువీరా రెడ్డిని నియమించింది. విభజన సమయంలో ఉన్న సెంటిమెంట్, కోపం కారణంగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. టీడీపీ విజయం సాధించగా, వైకాపా 67 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అక్కడ దారుణంగా మారిపోయింది.
ఆ తరువాత ఐదేళ్ళలో పార్టీ బలం పుంజుకోవడానికి ఏం చేసింది అంటే అసలేం చేయలేదని చెప్పాలి. కనీసం ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోలేకపోయింది. ఒకవైపు వైకాపా అధినేత జగన్ ప్రజల్లోకి వెళ్లి తెలుగుదేశం పార్టీని ఎండగడుతూ.. ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్తూ పాదయాత్ర చేశారు. జగన్ పాదయాత్రకు విశేషమైన స్పందన వచ్చింది. 130 సంవత్సరాల అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ఎందుకనో సీరియస్ గా తీసుకోలేదు.
2014లో ఓడిపోయింది సరే.. కనీసం 2019 వ సంవత్సరంలో అయినా కాస్త బలపడాలి కదా. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో అయినా కాస్త మెరుగైన ఫలితాలు సాధించాలి కదా. కానీ, 2019 లోను అదే తీరుగా ఫెయిల్ అయ్యింది. ఇదే ఆ పార్టీకి కలిసి రాలేదు. బలమైన నాయకత్వ లోపం ఆ పార్టీని కుదేలయ్యేలా చేసింది అనడంలో సందేహం లేదు. గెలవాలనే తపన, కొద్దిగానైనా బలపడాలనే తపన ఆ పార్టీలో కనిపించలేదు.
2019 లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. చాలా రాష్ట్రాల్లోని పీసీసీ అధ్యక్షులు కూడా రాజీనామాలు చేశారు. ఏపీలో మాత్రం అలా జరగలేదు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎవరు అంటే దాదాపుగా ఎవరికీ తెలియని పరిస్థితిల్లో ఆ పార్టీ పడిపోయింది. ఇపుడు పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. పీసీసీ రేసులో సాకే శైలజానాథ్ కు పీసీసీ పదవి అప్పగించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.