ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయాలు జోరుగా రంజుగా, రసవత్తరంగా సాగుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగిన వ్యవహారం వైసీపీ అధికారంలోకి రాగానే వారికి బ్రేక్లు పడ్డాయి.. బ్రేకులు పడటమే కాదు.. నోరు మెదిపారో ఇక శ్రీకృష్ణ జన్మస్థానంలోకి వెళ్ళాల్సిందేననే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ నేతలు గత పాపాలకు ప్రాయచిత్తంగా తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. దీనికి నిదర్శనం మాజీ స్పీకర్ కోడేల శివప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, తాజాగా చింతమనేని ప్రభాకర్లు నిదర్శనంగా నిలుస్తున్నారు..
టీడీపీ అధికారం ఉన్నప్పుడు విచ్చలవిడిగా వ్యవహారాలు నడుపడమే కాకుండా వైసీపీని టార్గెట్ చేసిన నేతల చిట్టా విప్పుతున్నారు అధికార పార్టీ నేతలు. అంతే కాదు.. అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలను గుర్తించి వారిని కటకటాల పాల్జేసెందుకు వైసీపీ వెనుకాడటం లేదు.. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన కొందరు నేతలు కనీసం నోరు మెదిపేందుకు ససేమిరా అంటున్నారు. ఇప్పుడు అదే కోవలోకి వస్తున్నారు కొందరు.. వీరిలో ప్రధానంగా టీడీపీ ఆధినేత చంద్రబాబు నాయుడుకు అంగబలం, అర్ధబలంతో కొండంత అండగా నిలిచిన మాజీ ఎంపీ మురళీమోహన్ ముందు వరుసలో ఉన్నారు.
సిని రంగంలో ఆరితేరిన సిని నటుడు, రియల్ ఎస్టేట్ రంగంలో నిష్ణాతులు, రాజకీయ రంగంలోనూ కీలక నేతగా ఉన్న మురళీ మోహన్ ఇప్పుడు తన నోటికి తాళం వేశారు. కరువ మంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం.. అన్నట్లుగా ఉందన్న సత్యం గ్రహించిన మురళీమోహన్కు అనారోగ్యం ఆయన పాలిట వరంగా మారిందనే చెప్పవచ్చు.. ఎందుకంటే.. మురళీమోహన్కు ఎన్నికలకు ముందు అనారోగ్యంకు గురయ్యాడు. దీంతో గత ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేయకుండా, తన కోడలును పోటీ చేయించాడు.
అయినా ఆమే వైసీపీ నేత చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఇక కోడలు ఓడిపోవడం, తాను నమ్ముకున్న పార్టీ అధికారం కోల్పోవడంతో మురళీమోహన్ ఇక మౌనంగా ఉండిపోయారు. అరోగ్యంగా బాగానే ఉన్నప్పటికి మురళీమోహన్ ఇప్పుడు కనీసం వైసీపీ ప్రభుత్వంపై పల్లెత్తు మాట మాట్లాడటం లేదు.. ఎంపీగా ఉన్నప్పుడు తోటీ ఎంపీలతో కేంద్రంలో క్రీయాశీలక పాత్ర పోషించిన మురళీమోహన్ అధికారం చేతులు మారడంతో అనువుగాని చోట అధికులమనరాదు అనే సూత్రాన్ని ఒంటబట్టించుకున్నాడు.. ఇప్పటికే మురళీమోహన్పై అనేక జయభేరీ రియల్ ఎస్టేట్ పేరుతో అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలపై అదను దొరకగానే అడ్డంగా బుక్ చేస్తూ కటకటాల పాలు చేస్తుండటం గ్రహించిన మురళీమోహన్ తనకేమి తెలియదు... అసలు రాజకీయాలు నాకు సరిపడవు.. అనే రీతిలో వ్యవహరిస్తూ మౌనం దాల్చాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని తానై వ్యవహరించిన మురళీమోహన్ ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంటే పార్టీ వైపు కన్నేత్తి కూడా చూడటం లేదట.. అంటే నోరు తెరిస్తే బతుకు తెర్లు అవుతుందనే భయం పట్టుకోవడంతోనే మురళీమోహన్ మౌనం దాల్చాడని అర్థమవుతుంది.