మొదటి బహిరంగ సభలోనే సంచలన ప్రకటన
డిసెంబర్ 26వ తేదీన కడప
స్టీలు ఫ్యాక్టరీకి శంకుస్ధాపన చేయనున్నట్లు జగన్ సంచలన ప్రకటన చేశారు. దాదాపు 20
వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలిగిన ఫ్యాక్టరీ జిల్లాకు ఎంత ఉపయోగమో
వివరించారు. ఇదే ఫ్యాక్టరీని అడ్డుపెట్టుకుని చంద్రబాబునాయుడు ఎన్ని నాటకాలాడింది
కూడా వివరించారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న మొదటి బహిరంగ సభకు జనాలు బ్రహ్మారథం పట్టారు. సొంత జిల్లా కడడలోని జమ్మలమడుగు మొదటి బహిరంగ సభకు వేదికగా నిలిచింది. ఈ సభలోనే ఎన్నికలకు ముందు ప్రకటించిన నవరత్నాలు కూడా అమలుకు శ్రీకారం చుట్టారు.
రైతులు, వృద్ధులు, పేదలు, విద్యార్ధులకు నవరత్నాల్లో భాగంగా అనేక వరాలను జగన్ కురిపించారు. ఈరోజు వైఎస్ జయంతి కూడా కావటంతో వైఎస్ పెన్షన్ పథకాన్ని జగన్ ప్రారంభించారు. ఇందులో అవ్వా, తాతలకు నెలకు రూ 2250, డయాలసిస్ రోగులకు రూ. 10 వేలు, వికలాంగులకు రూ. 3 వేలు అందించనున్నట్లు జగన్ చెప్పారు.
మొత్తం మీద పెన్షన్ పథకాన్ని తన జిల్లా నుండే జగన్ ప్రారంభించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పెన్షన్ పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అవినీతి పాలనపై మండిపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన నెలలోపే అమలు చేసిన హామీలను వివరించారు.
అలాగే గోదావరి జలాలను ఏపికి తీసుకురావటంలో కెసియార్ తో కలిసి చేస్తున్న ప్రయత్నాలను కూడా వివరించారు. గోదావరి జలాలు కృష్ణా నదితో కలిస్తే రాష్ట్రం ఏ విధంగా శస్యస్యామలం అవుతుందో వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో తమ చిత్తశుద్దిని గుర్తు చేశారు.