మోడీ మాయ‌: బీహార్‌కు వ‌ర‌ద సాయం.. ఏపీకి బుర‌ద సాయం.. !

RAMAKRISHNA S.S.
- మోడీ అంటే గుప్పెడు మ‌ట్టి.. ముంతెడు నీళ్లే
- బిహార్‌కు వ‌ర‌ద సాయం.. ఏపీకి నిల్‌
- నితీష్ బెదిరింపులు బాబు చేయ‌లేరా..?
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ప్ర‌ధాన మంత్రి  న‌రేంద్ర మోడీ మాయ‌.. అంటే ఎలా ఉంటుందో ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలియంది కాదు. అయి నా.. ఎప్పుడూ.. ఆయ‌న మాయ‌లో ప‌డిపోతుండ‌డ‌మే ఏపీ చేసుకున్న అదృష్ట‌మో.. దౌర్భాగ్య‌మో!!  గ‌తంలో 2015లో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కి ఆయ‌నే శంకు స్థాప‌న చేశారు. ఆ స‌మ‌యంలో ఏదో చెక్కుతో వ‌స్తారు.. ఏపీకి ల‌క్కు చిక్కిన‌ట్టేన‌ని అంద‌రూ అనుకున్నారు. భారీ ఎత్తున ప్ర‌ధాని వ‌స్తున్నార‌హో అంటూ.. ప్ర‌చారం కూడా చేశాం. అప్పుడు ఉన్న‌దీ చంద్ర‌బాబు స‌ర్కారే.

కానీ.. మోడీసార్‌... గుప్పెడు మ‌ట్టి.. ముంతెడు నీళ్లు తెచ్చి.. ప‌విత్ర జ‌లాలంటూ.. ఏపీ ప్ర‌జ‌ల‌కు అప్ప‌గించి వెళ్లారు. క‌ట్ చేస్తే.. సుదీర్ఘ విరామం త‌ర్వాత ఏపీని ఉద్ద‌రిస్తున్నామంటూ... ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఎన్నిక‌ల కు ముందు.. త‌ర్వాత కూడా.. భారీ ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. కానీ, తాజాగా ప్ర‌క‌టించిన బడ్జెట్‌లో రూ.15 వేల కోట్ల అప్పు సంగ‌తి ప‌క్క‌న పెట్టండి. అస‌లు క‌థ ఏంటంటే.. మ‌రో మిత్ర ప‌క్ష పార్టీ జేడీయూ అధికారంలో ఉన్న‌ బిహార్‌కు వ‌ర‌ద‌సాయం ప్ర‌క‌టించారు.

బిహార్‌లో ఏటా కోశీ న‌దికి వ‌ర‌ద‌లు వ‌స్తుంటాయి. దీంతో ప‌ల్ల‌పు ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు వ‌చ్చి.. ప్ర‌జ‌లు అల్లా డిపోతున్న మాట వాస్త‌వ‌మే. దీంతో మోడీ స‌ర్‌.. ఆ రాష్టానికి ఏకంగా 11 కోట్ల రూపాయ‌ల‌ను అచ్చంగా.. వ‌ర‌ద సాయం కింద‌.. వంతెన‌లు.. కోశీన‌దికి అడ్డుక‌ట్ట‌లు క‌ట్టించేందుకు కేటాయించారు. ఇవి అప్పు కాదు సుమా?  అలా అంటే.. నితీష్ మోడీ లేడు.. ప‌కోడీ లేడు.. అంటూ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడ‌ని అంద‌రికీ తెలిసిందే. అందుకే ఆ నిధుల‌ను అంటే.. ఏపీకి ఇప్పిస్తాన‌న్న 15 వేల కోట్ల రూపాయ‌ల్లో 4 వేల కోట్లు త‌క్కువ‌గా ప్ర‌క‌టించిన 11 వేల కోట్ల‌ను నేరుగా బ‌డ్జెట్ నుంచి కేటాయించేశారు.

స‌రే.. పోనీ.. పాపం అనుకుందాం. బీహార్ కు సాయం చేస్తే.. మ‌న‌కెందుకు ఏడుపు? అని ఆత్మ చింతన చేసుకుందాం. కానీ, ఇక్క‌డే తిర‌కాసు ఉంది. అదే బీహార్‌కు ఒక న‌ది కోశీ నుంచి వ‌చ్చిన‌ట్టు ఏపీకి రెండు న‌దులు.. కృష్ణా, గోదావ‌రుల నుంచి కూడా ఏటా వ‌ర‌ద‌లు కామ‌న్‌. దీంతో ఉభ‌య గోదావ‌రి జిల్లాలు స‌హా.. ఏలూరు జిల్లాలోని ఎర్ర‌కాలువ‌.. విజ‌య‌వాడ‌లో కృష్ణ‌మ్మ ధాటికి అనేక ప్రాంతాలు, గ్రామాలు కూడా మునిగిపోతున్నాయి. మరి ఆ చేత్తోనే అంతో ఇంతో మ‌న‌కు కూడా ఇవ్వ‌రాదా? అన్న‌ది ఏడుపు. అలా ఇస్తే.. మోడీ ఎందుకు అవుతారు.. అలా చేస్తే.. మాయ చేసిన‌ట్టు ఎలా అవుతుంది. మెత్త‌టి చేత్తో ఓటి చెంబు పెట్టుకుని గ‌ట్టిగా అప్పు రూపంలో మొత్తార‌న్న మాట‌. ఇదీ.. మోడీ మాయంటే!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: