తెలంగాణలో స్థానిక ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని రేవంత్ రెడ్డి చాలా వ్యూహాలను పన్నుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క ప్లాన్ ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఈ వ్యూహంలో సక్సెస్ అవుతున్నారు. ఆయన వల్ల ఇప్పటికే 9 మందికి పైగా BRS ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు, మరికొంత మంది త్వరలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.
విపక్షాల నుంచి ఎక్కువ మంది సభ్యులను కాంగ్రెస్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ఇంతకుముందు ప్లాన్ చేశారు ఇప్పుడు అదే ప్లాన్ రివర్స్ అయ్యింది. రేవంత్ రెడ్డి కెసిఆర్ ఎంతమందిని లాక్కున్నారో వారందరినీ తిరిగి మళ్ళీ లాక్కుంటున్నారు. బీఆర్ఎస్ నేతలు సైతం తమ పార్టీలో విలీనం చేస్తున్నారు. చేరిన తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కొన్నిచోట్ల బలంగా ఉండగా, మరికొన్ని చోట్ల తృటిలో వారు ఓడిపోవడం జరిగింది.
చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన భీమ్ భరత్ కేవలం 282 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య చేతిలో ఓడిపోయారు. ఆ నియోజక వర్గంలో పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న భరత్, అతని మద్దతుదారులు యాదయ్య కాంగ్రెస్లో చేరడంపై అసంతృప్తిని బాగా వ్యక్తం చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఆ ప్రాంతంలోని తన పార్టీ నేతల ఫిర్యాదులను తగ్గించగలిగారు.
కాంగ్రెస్ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయకుండా నేరుగా వారితో మాట్లాడి రాబోయే ఐదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉంచాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పార్టీలో కీలక పదవులు ఇస్తామని ఆయన భరోసా ఇస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఇలా చేరికలు జరుగుతుంటే అసంతృప్తి అనేది బాగా వ్యక్తమౌతుంది. దీనివల్ల కాంగ్రెస్ నేతలు ఇప్పటివరకు ఈ పని చేయలేకపోయారు కానీ రేవంత్ రెడ్డి సుసాధ్యం చేసి చూపిస్తున్నారు.