సీమ ఎమ్మెల్యే తాలూకా : ఆదినారాయణ రెడ్డి రాజకీయం వేరు... మీరు చూస్తారా..?
- జమ్మలమడుగులో బీజేపీ నుంచి గెలిచి రికార్డుల మోత
- 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇగోకు పూర్తి దూరం
( కడప - ఇండియా హెరాల్డ్ )
ఆదిలో కాంగ్రెస్ పార్టీ.. తర్వాత.. వైసీపీ.. ఆ తర్వాత టీడీపీ.. ఇప్పుడు బీజేపీ.. పార్టీలు మారారు. కానీ, ఆయ న స్టయిల్ మాత్రం మారలేదు. ఆయనే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి. ముక్కుసూటి తనం.. తాను చేయాలనుకున్నది చేయడం.. చెప్పాలనుకున్నది చెప్పడం ఆది స్టయిల్. ఎవరో నొచ్చు కుంటారని ఆయన బాధపడరు. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఆయన ఇజం కూడా. ఇదే ఆయనను సుదీర్ఘకాలంలో రాజకీయాల్లో నిలబెట్టింది.
పార్టీలు మారినా.. ఆయన వ్యక్తిత్వంలో మార్పు రాకపోవడమే.. ప్రజలకు ఆయనను చేరువ చేసింది. సహ జంగా 30 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న సీమ నాయకుల్లో ఎక్కడో ఒక్క చోట అయినా.. ఇగో ప్రాబ్లం ఉంటుంది. వస్తుంది కూడా. కానీ, ఆదిలో ఆ తరహా ఆలోచనలు లేవు. ప్రజలకు ఏది అవసరమో.. గుర్తించడంలోనే ఆయన తపన పడతారు. కాంగ్రెస్ హయాం నుంచే వైఎస్ కుటుంబానికి ఎంతో విదేయతగా ఉన్న ఆది.. వైఎస్ హయాంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు.
తర్వాత.. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పోర్టీ కొట్టుకుపోయిన నేపథ్యంలో వైసీపీ బాట పట్టారు. అయితే.. అధి నేత జగన్ రాజకీయాలకు ఆయనకు ఇమడలేదు. దీంతో నిర్మొహమాటంగా ఆయన బయటకు వచ్చారు. టీడీపీ బాటపట్టారు. ఈ క్రమంలోనే ఆదిలో ఉన్న పనితీరును గుర్తించిన చంద్రబాబు ఆయనకు మంత్రి పదవిని అప్పగించారు. మంత్రి పదవికి కూడా వన్నె తీసుకురావడంలో ఆది ముందున్నారు. ఫ్యాక్షన్ జోన్ నుంచి వచ్చినా.. ఎక్కడా అలాంటి రాజకీయాలు చేయలేదు. ఇది బాబుకు మరింత కలిసి వచ్చింది.
ఇక, 2019లో టీడీపీ పరాజయంతో ఆయన బీజేపీలో చేరారు. పార్టీకి ఓటు బ్యాంకు లేకున్నా.. కొన్ని వ్యక్తి గత కారణాలతో ఆయన బీజేపీని ఆశ్రయించారు. పార్టీ తరఫున రాష్ట్ర నాయకత్వం నిస్సత్తువలో ఉన్న సమయంలో కూడా.. ఆది విజృంభించి.. తన నియోజకవర్గంలో బీజేపీ కార్యక్రమాలను నిర్వహించారు. తద్వారా.. అసలు బీజేపీ అంటే గిట్టని వారికి కూడా ఆది చేరువయ్యారు. ఇది ఆయనను తాజా ఎన్నికల్లో విజయం దక్కించుకునేలా చేసింది. ఏది ఇస్తే అది తీసుకోవడం.. పార్టీ కోసం పనిచేయడమే లక్ష్యంగా అడుగులు వేసిన ఆది నారాయణరెడ్డి.. ప్రజానేతగా గుర్తింపు తెచ్చుకున్నారనడంలో సందేహం లేదు.