* ఇక నుంచి జనాల్లోనే జగన్
* బూతుల నేతలకు చెక్!
* కష్టపడ్డ నాయకులకే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... మొన్న జరిగిన అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో... జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాభవం ఎదురైంది. 175 సీట్లకు 175 సీట్లు కొడతానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డికి.. ఏపీ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. కేవలం 11 స్థానాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి... ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి రావడం కష్టమేనని తెలుస్తోంది.
అయితే ఇలాంటి నేపథ్యంలో... వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా.. ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి పని చేయాలి. మొన్నటి ఎన్నికల సమయంలో చేసిన తప్పిదాలు... గత ఐదు సంవత్సరాల తన పాలనలో... జరిగిన మిస్టేక్స్ పసిగట్టి ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా ఏపీలో... బూతుల నాయకుల వల్ల వైసిపి ఓడిపోయిందని... స్వయంగా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మాజీ మంత్రి రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, పేర్ని నాని ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది లీడర్లు వైసీపీలో ఉన్నారు.
ఇందులో... కీలక నేతలందరూ టిడిపి నుంచి వైసీపీకి వచ్చినవారే. ఇలా పార్టీ మారిన నేతలే ఎక్కువ శాతం... బూతుల నాయకులుగా మారిపోయారు. మైకు ముందు కూర్చుంటే చాలు... చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని, అటు పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని పచ్చి బూతులు తిట్టి... జనాల దృష్టిలో విలన్లుగా మారిపోయారు. ఈ నాయకులు ప్రెస్ మీట్ పెడితే... బూతులు తప్ప ఏమీ ఉండవని... ఏపీ ప్రజలు గ్రహించారు.
అయితే ఇలాంటి నాయకులను... జగన్మోహన్ రెడ్డి అదుపులో పెట్టుకోవాలి. రాజకీయాలు అంటే.. బూతులు కాదు.. అని వారికి క్లాస్ పీకాల్సి ఉంది. ముఖ్యంగా ఇలాంటి నేతలకు కీలక పదవులు అస్సలు ఇవ్వకూడదు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కూడా జగన్ చాలా తప్పు చేశారు. ప్రత్యర్థులపై దాడి చేసేటప్పుడు.. చాలా సభ్యతగా మాట్లాడే సంస్కృతిని తీసుకురావాలి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి ఏ నాయకులు వచ్చినా తీసుకోకుండా... వైసీపీలో కష్టపడ్డ వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలి. ఇక ముందు నుంచి ఇలా వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి ఏపీలో మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.