ఏపీ : బాబోరి సంతకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్...!

FARMANULLA SHAIK
సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా ఇతర శాఖల మంత్రులు హాజరయ్యారు. మూడున్నర గంటల పాటు మంత్రివర్గం సమావేశం కాగా.. పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ క్రమంలో నిరుద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 16,347 పోస్టులను డిసెంబర్ 10లోపు భర్తీ చేయాలని నిర్ణయించింది. జులై 1 నుంచి డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే, కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై 2 ప్రతిపాదనలపై భేటీలో చర్చించారు.అలాగే వివాదాస్పద ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.


దీంతో పాటు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన అన్న క్యాంటీన్లను తిరిగి తెరిచేందుకు వీలుగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వీటిని అందుబాటులోకి తెస్తారు. అలాగే చంద్రబాబు ఐదో సంతకం అయిన నైపుణ్యాల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటు విజయవాడలో ఉన్న వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరును తిరిగి ఎన్టీఆర్ గా మార్చాలని నిర్ణయించారు.పింఛన్ల పెంపుపైనా కేబినెట్లో చర్చించారు. పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి పెంచిన పింఛన్లు అందించనున్నారు. ఏప్రిల్ నుంచి ఉన్న పింఛన్ బకాయిలతో కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7 వేల పింఛన్ అందనుంది. జులైలో ఒకేసారి 65 లక్షల మంది లబ్ధిదారులు రూ.7 వేల పింఛన్ అందుకోనున్నారు. వారికి ఇంటి వద్దకే పెరిగిన పింఛన్లు అందించనున్నారు.

తొలి కేబినెట్ కావడంతో మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేస్తున్నారు. శాఖలవారీగా ఎలా ముందుకెళ్లాలన్నదానిపై మంత్రులకు సూచనలు చేస్తున్నారు. శాఖలవారిగా శ్వేతపత్రాల విడుదలకు మంత్రులకు సూచిస్తున్నారు. శాఖలపై పట్టుసాధించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ.. శాఖలకు మంచిపేరు తీసుకురావాలన్నారు సీఎం చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: