ఏపీ: జగన్ ఇక ఒంటరివాడేనా?

Suma Kallamadi
ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు వెలువడిన వేళ, జగన్ ఇక ఒంటరివాడేనా? అన్న అనుమానం సొంత వైసీపీ గూటిలోనే వ్యక్తమౌతోంది. నిన్న వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌లో అధికారం అత్యధికంగా టీడీపీ కూటమికే చెందుతుందనేది తేటతెల్లం అయిపోయింది. పీపుల్స్‌ పల్స్‌, రైజ్‌ తదితర బడా సంస్థలు కూటమివైపే మొగ్గు చూపాయి. ఈ క్రమంలో ప్రజల్లో జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశాయి. అయితే నిన్నగాక మొన్న పుట్టుకొచ్చిన అనామక సంస్థలు మాత్రం వైసీపీయే అధికారంలోనికి వస్తుందంటూ జోశ్యం చెప్పినప్పటికీ అవి అంత ప్రభావాన్ని చూపలేకపోయాయి. అయినప్పటికీ జగన్‌కు చెందిన చెందిన నీలి మీడియాలో మాత్రం అదే సర్వేలను ప్రముఖంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వ పెద్దలను మెప్పించే పనిలో పడ్డాయి. అయినప్పటికీ ఆయా సంస్థలు కూడా జగన్‌ చెప్పినట్లుగా 151 స్థానాలకు మించి వస్తాయని పేర్కొనకపోవడం కొసమెరుపు.
విషయం ఏమిటంటే వైసీపీ, టీడీపీ కూటమి మధ్య ఓట్లతేడా స్వల్పంగానే ఉంటుందని పేర్కొనడం ఇపుడు ఆయా నీలి నాయకులకు మింగుడుపడడం లేదు. కాగా మరో 48గంటల్లో ఓట్ల లెక్కింపు, అసలైన ఫలితాలు వెలువడనున్నాయనే విషయం అందరికీ విదితమే. ఈలోగా ప్రజల్లో ఎన్నికల ఫలితాలపై ఆయోమయం సృష్టించడం ద్వారా కొద్ది గంటలైనా కేడర్‌ను సంతోష పర్చవచ్చని కొన్ని నీలి, కూలి మీడియాలు ఆరాటపడుతున్నాయి. అయితే ఆ విషయం గ్రహించిన అధికార పార్టీ నాయకులకు మాత్రం రియాలిటీ ఏమిటో ఈపాటికే అర్ధం అయిపోయింది. దాంతో మనవాళ్ళు జగన్ ని ఒంటరివాడిని చేసే పనిలో పడ్డారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదేనండీ... ఫలితాలు వెలువడిన మరుక్షణం వారు పచ్చ తీర్ధం పుచ్చుకోనున్నారని గుసగుసలు వినబడుతున్నాయి.
అవును, ప్రజానాడి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా వ్యతిరేకంగా ఉందన్న సమాచారం వైసీపీ అభ్యర్థులను ఇపుడు గందరగోళంలోకి నెడుతోంది. మళ్లీ అధికారంలోనికి వచ్చి తీరుతాం అని, తొమ్మిదో తేదీన విశాఖ వేదికగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతాం అని స్వయంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రకటిస్తున్నా.. వారిలో విశ్వాసం కలుగడం లేదు అనడానికి తాజా పరిణామాలే కారణం. ఇప్పుడు తీరా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చూశాక వారిలో ఏ మూలనో ఉన్న చిగురాశలు కూడా చెదిరిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: