2024 ఏపీ ఎన్నికల హీరోల్లో ' పెమ్మసాని ' టాప్ ర్యాంకర్..!
- ఎన్నారై అయినా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని రాజకీయం
- వైసీపీ కిలారు రోశయ్య ఆశలు కౌంటింగ్కు ముందే గల్లంతా ?
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలిచే ఎంపీ సీట్లలో మొదటగా వినిపించే పేరు గుంటూరు పార్లమెంటు. గత ఎన్నికలలో వైసిపి తిరుగులేని ఘనవిజయం సాధించి 25 ఎంపీ సీట్లలో ఏకంగా 22 చోట్ల ఘనవిజయం సాధించింది. అంతా వైసీపీ వేవ్ లో కూడా గుంటూరు - విజయవాడ - శ్రీకాకుళం ఎంపీ సీట్లలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఈసారి తెలుగుదేశం భారీ మెజార్టీతో తిరిగి లేని విజయం సాధించే సీటు ఏది అంటే ముందుగా వినిపించే పేరు గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్. ఎన్నారై గా ఉన్న పెమసాని చంద్రశేఖర్ గత రెండు ఎన్నికల నుంచి గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీగా పోటీ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
అయితే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా చంద్రబాబు పెమ్మసాని పేరు ప్రకటించారు. ఆయన పేరు ప్రకటించినప్పటి నుంచి ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగానే హైలెట్ అయ్యారు. చంద్రశేఖర్ ప్రజల్లోకి చొచ్చుకుపోవడంతో పాటు పార్లమెంటు పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని నియోజకవర్గాలలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ లోపాలు సరి చేసుకుంటూ అన్ని వర్గాల్లోకి పెమ్మసాని దూసుకుపోయారు. ఇంకా చెప్పాలి అంటే పెమ్మసాని గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా వచ్చినప్పటి నుంచి గుంటూరు పార్లమెంటు మొత్తానికి తెలుగుదేశం పార్టీకి తిరుగులేని ఊపు వచ్చిందని చెప్పాలి.
ఇక నామినేషన్ల పర్వంలో కూడా 5800 కోట్ల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో చూపించడంతో పాటు ప్రచారంలోనూ ఎవ్వరిపై మాట తూలకుండా... చాలా సంప్రదాయంగా సుతిమెత్తని విమర్శలు చేస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా మాట్లాడడంతోనే అందరిని ఆకట్టుకున్నాడు పెమ్మసాని. ఎన్నారైగా ఉన్నా స్థానిక సమస్యలపై తిరుగులేని అవగాహన ఉండడం.. కనీసం ఓ 20 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వాడిలా మాట్లాడడంతోనే అందరూ ఆశ్చర్యపోయారు. పార్లమెంటు పరిధిలోని ఏడు ఎమ్మెల్యే సీట్లతో పాటు మంగళగిరి, తాడికొండలో భారీ మెజార్టీలతో ఓవరాల్గా పెమ్మసాని మెజార్టీ తక్కువలో తక్కువగానే 1.50 లక్షలు ఉంటుందని... అది మరింత పెరిగినా పెరుగుతుందన్న లెక్కలు రాజకీయ వర్గాలు చెపుతున్నాయి.