ముఖాలు నల్లబడ్డాయ్.. గొంతలు పూడుకుపోయాయ్.. మరో 7 డేస్.. !
ఎన్నడూ బొంగురు కూడా పోని గొంతుకలు.. . పూడుకుపోయాయ్!
రోడ్డు పక్కన హాకర్ల కంటే ఎక్కువగా అరుపులు.. కేకలతో నోళ్లు పగులుతున్నాయ్!
చెమటలు కారుతున్నా.. ఒళ్లు అలిసిపోతున్నా.. ఆశల రెక్కలు ఆవురావుమంటున్నాయ్!!
ఎనిమిది రోజులు మరొక్క ఎనిమిది రోజులు.. నేతల కష్టాలకు.. వారి ఆవేశ కావేశాలకు డెడ్ లైన్!!
- ఇది ఇతమిత్థంగా.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల అధినేత, ఆయా పార్టీల అభ్యర్థల పరిస్థితి!! మరో 7 రోజుల వరకు ఇంతే. అంతేకాదు.. మరింత జోరు, హోరు పెరిగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. ఏనిముషానికి ఏమి అయినా జరగొచ్చు.. ఓటరు నాడి మారొచ్చు. అది తమవైపే మారాలని.. తమ జపమే చేయాలని నాయకులు కోరుకోవడం తప్పుకాదు. కానీ, ఆ నాడి ఎవరిదనేది మాత్రం.. 13వ తేదీ బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అయ్యే వరకు సస్పెన్సే. అందుకే ఈ యాగీ.. !!
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు.. నాయకుల ప్రయాస అంతా ఇంతా కాదు. ఎండలకు ఓర్చుకునే వారు కొందరు. ఎండలకు ఓర్వలేక.. చల్లని సాయంకాలం రాకపోతుందా.. అని వేచి చూసేవారు మరికొందరు. ఎలా చూసుకున్నా.. ఎన్నికల గడువు, ఘడియ మాత్రం నెమ్మదిగా చొచ్చుకొస్తోంది. మరి జనం నాడి ఎవరి వైపు? అంటే.. అందరూ దిక్కులు చూసుకునే పరిస్థితి! ఆశ్చర్యం లేదు. నిజమే!! ఎవరూ ప్రశాంతంగా లేరు. ఏ పార్టీ కూడా ఊపిరి పీల్చుకోవడం లేదు. ఇది పచ్చినిజం!
పోరు లాభం కోరుతున్న ప్రతిపక్షాల తాకిడితో వైసీపీ, విశ్వసనీయత విజయం దక్కిస్తున్న అచెంచెల విశ్వాసంతో ఉన్న అధికార పార్టీ.. ఈ రెండు పక్షాలకు పట్టు చిక్కడం లేదు. ప్రజాభిప్రాయం తెలియడం లేదు. ఇంతలోఎవరో వస్తారు.. మీకే అనుకూలం అంటారు. జేజేలు! మరెవరో తెరమీదికి వస్తారు... మీకు ఇబ్బంది అంటారు.. నీరసం!! వెరసి దాగుడు మూతల రాజకీయం.. నేతలకు.. పార్టీలకు ఊపిరిసలపనీయక పోగా.. ఉక్కపోత పెంచేస్తోంది. దటీజ్ 2024 ఎలక్షన్స్..!! కౌంట్ డౌన్ 7 డేస్!!