ఏపీ: బందరులో పేర్ని నాని కుమారుడు గెలిచేనా.. యువ నేతకు సవాళ్లివే..?

Suma Kallamadi
ఏపీలోని ప్రస్తుతం అందరి దృష్టి కొన్ని కీలకమైన నియోజవర్గాలపై ఉంది. అలాంటి వాటిలో మచిలీపట్నం (బందరు) కూడా ఒకటి. ఇక్కడి నుంచి పేర్ని నాని ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సీఎం జగన్‌కు నమ్మకమైన నేతగా, వైసీపీ తరుపున ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇచ్చే వ్యక్తిగా ఆయనకు పేరుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రసంగించగానే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి పుల్లవిరుపు కౌంటర్లు ఆయన వేస్తారు. అయితే ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన కుమారుడు పేర్ని కిట్టూను వైసీపీ బరిలోకి దింపింది. యువ నాయకుడు కావడంతో ఆయన నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతున్నారు. మరో వైపు ఆయనకు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా పోటీ చేస్తున్నాయి. ఇలా కూటమి తరుపున పోటీ చేయనున్న కొల్లు రవీంద్రకు గెలుపు అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. అయితే వైసీపీ మాత్రం తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ పార్టీకి విజయావకాశాలు తీసుకొస్తాయని వైసీపీ బలంగా నమ్ముతోంది. సీనియర్ నేతను వైసీపీ నుంచి యువ నేత ఢీకొడుతుండడంతో ఈ నియోజకవర్గంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
టీడీపీ, బీజేపీ, జనసేనపై సెటైర్లు వేస్తూ ఆకట్టుకునే పేర్ని నాని ప్రస్తుతం బరిలో నుంచి తప్పుకున్నారు. మచిలీపట్నంలో ఆయన కుమారుడు పేర్ని కిట్టూను వైసీపీ ఎన్నికల బరిలోకి దించింది. పేర్ని నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతానని ప్రకటించినా, ఆయన తన కుమారుడిని ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారు. దీంతో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టూను ఓడించాలని టీడీపీ, బీజేపీ, జనసేన కృతనిశ్చయంతో ఉన్నాయి. మచిలీపట్నంలో పేర్ని కుటుంబానికి చాలా ఏళ్లుగా రాజకీయాలతో అనుబంధం ఉంది. పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి 1989 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన 1994 ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. తర్వాత 1999లో పేర్ని నాని తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ఓటమి చెందారు. 2004లో కాంగ్రెస్ వేవ్‌లో పేర్ని నాని ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లోనూ ఆయనకే మచిలీపట్నం ప్రజలు పట్టం కట్టారు. ఆ తర్వాత 2014లో పేర్ని నాని ఓటమి చెందారు. ఆయనపై టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ఘనవిజయం సాధించారు. 2019లో మరోసారి ఎన్నికల బరిలోకి దిగి గెలిచిన నానికి సీఎం జగన్ మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో నాని మంత్రి పదవి ఊడిపోయింది. అయినప్పటికీ వైసీపీకి వీర విధేయుడిగా ఆయన కొనసాగుతున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుని కొడుకును బరిలోకి దింపారు. మరో వైపు కొల్లు రవీంద్ర సైతం రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన వారే. ఆయన మామ నడికుదిటి నరసింహారావు 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వారసుడిగా బరిలోకి దిగి 2014లో గెలిచిన కొల్లు రవీంద్ర నాటి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. తిరిగి ప్రస్తుతం 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీలో ఉన్నారు. ఇదిలా ఉండగా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసులు మోపి, ఆయనను జైలుకు పంపింది. ఆ సమయంలో ఆయనకు ప్రజల నుంచి సానుభూతి లభించింది. మరో వైపు కూటమి బలంగా ఉండడం, నియోజకవర్గంలో బలమైన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన గెలుస్తారనే అంచనాలు ఉన్నాయి. దీంతో పేర్ని కిట్టూకు ఎదురీత తప్పదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: