రేవంత్‌ సర్కార్‌: 100 రోజులు.. 100 మోసాలు?

Chakravarthi Kalyan
వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్‌ నేత హరీష్ రావు అంటున్నారు. ఏ మొహం పెట్టుకొని లోక్ సభ ఎన్నికల్లో ప్రజల ఓట్లు అడుగుతారని బీఆర్ఎస్‌ నేత హరీష్ రావు ప్రశ్నించారు. హామీలు అమలు చేయని రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు తీర్పు ఇవ్వాలని హరీష్ రావు కోరారు. వంద రోజుల్లో ఉద్యోగులకు ఒక్క డీఏ కూడా ఇవ్వలేదన్న ఆయన... ఉపాధ్యాయ, ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, చిత్తశుద్ది  ఉంటే వెంటనే నాలుగు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో వివిధ వర్గాల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని మాజీ మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ప్రజా పాలన అని ఇపుడు చంపుతాం, చీరుతాం, పేగులు మెడలో వేసుకుంటామని అంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రజాపాలనలో నిర్బంధాలు, కేసులు పెరిగాయని... రాష్ట్రంలో వచ్చిన కరవు కాదని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరవుగా హరీష్ రావు అభివర్ణించారు. రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని చెప్పి బడ్జెట్ లో ఒక్క రూపాయి రాకుండా రైతాంగాన్ని మోసం చేశారన్న హరీష్ రావు వరికి 500 బోనస్ ఇస్తేనే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు ఉంటుందని, లేదంటే ప్రజాకోర్టులో ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

అడుగడుగునా రైతులకు అన్యాయం, మోసం చేసిన  రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఒక్క హామీ అమలు చెయ్యకుండా రైతాంగానికి ద్రోహం చేశారని, ఎండిన పంటలకు ప్రతి ఎకరాకు పదివేల నష్టపరిహారం చెల్లించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. మహాలక్ష్మి మహామోసంగా మారిందన్న ఆయన... రాష్ట్రంలోని ప్రతి మహిళకు 7500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బకాయి పడిందని పేర్కొన్నారు. మహిళలకు 7500 కోట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, బాండు పేపర్ మీద రాసిచ్చి మోసం చేసినందుకు మీపై ఎందుకు కేసు పెట్టరాదని హరీష్ రావు ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: