రెండున్నర సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అంటూ సొంతంగా పార్టీని నెలకొల్పారు దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల. అంతేగాక ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంపై కాలుదువ్వారు. ప్రతి మంగళవారం నాడు నిరుద్యోగ దీక్ష అంటూ దీక్షలకు కూడా దిగారు. అలాగే పాదయాత్ర పేరిట తెలంగాణ ప్రజల్లోకి కూడా వెళ్లారు.ఇంకా పాలేరు నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. అక్కడ క్యాంపు ఆఫీస్ ని నెలకొల్పారు. అయితే తీరా.. ఎన్నికల సమయం వచ్చేసరికి చేతులు ఎత్తేసి తన వైటీపీని కాంగ్రెస్ లో కలిపేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి మరీ ఆ తతంగంని ఈవిడ పూర్తి చేశారు. ఇక కొద్ది రోజుల కిందటనే ఏపీ పీసీసీ చీఫ్ గా కూడా నియమితులయ్యారు.ఇక అడ్డగోలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన పాపం ఖచ్చితంగా ముమ్మూటికీ కాంగ్రెస్ పార్టీదే. ఈ విషయం ఏపీలో చిన్న పిల్లలని అడిగినా చెప్తారు.అయితే, ఇందులో బీజేపీది కూడా సమాన పాత్ర ఉంది. ఇక ఈ పాపాన్ని మరో వందేళ్లయినా మోయాల్సిన కాంగ్రెస్ పార్టీని భుజాన మోసేందుకు షర్మిల గారు సిద్ధమయ్యారు.పైగా అంతేకాదు.. సొంత అన్న కాదనుకుని వచ్చిన పార్టీని.. అది కూడా ఆయన అధికారంలో ఉండగా ఆమె తలకెత్తుకున్నారు. అసలు ఇందులో అర్ధం ఏమిటో ఆమెకే తెలియాలి. సరే ఆయన్ని తీసేయ్. కానీ ఏపీ ప్రజలు ఎంతగానో అసహ్యం పెంచుకున్న కాంగ్రెస్ పార్టీని ఆమె మొయ్యడం అవసరమా..ఇక ఆదివారం నాడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు అయితే మరీ విచిత్రంగా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో అసలు పోటీనే చేయకుండా ఉన్న షర్మిల.. ఇక్కడి నియంత పరిపాలనకు అంతం పలికానని కామెడీగా చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు తన వంతు పాత్ర పోషించానని చెప్పుకొనే ప్రయత్నం చేశారు. ఇది వినేందుకు చాలా విచిత్రంగా అనిపించిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారును పడగొట్టడంలో కీలక పాత్ర పోషించింది రేవంత్ రెడ్డి.రెండున్నరేళ్ల క్రితం సరిగ్గా షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించిన సమయంలోనే రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి కాంగ్రెస్ పార్టీకి అసలు పేరే లేదు. అలాంటిది ఎన్నికల సమయానికి పార్టీని ప్రభావవంతమైన శక్తిగా రేవంత్ మార్చారు. ఎన్నికల్లో కేసీఆర్ వంటి పెద్ద నాయకుడిని ఢీకొట్టి కాంగ్రెస్ పార్టీను గెలిపించారు.ఇక ఇది అందరికీ తెలిసిన చరిత్ర అయితే.. నియంతను దించానంటూ షర్మిల వ్యాఖ్యానించడం చాలా ఫన్నీగా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఈ పేరిట ఆమె ఏపీ రాజకీయాల్లో ఫేమస్ అవ్వాలని చూస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ కి ఏపీ ప్రజలు పగలబడి నవ్వుతున్నారు. ఈరకంగా విచిత్రమైన కామెంట్స్ తో షర్మిల నవ్వుల పాలవుతున్నారు.