విశాఖ కుర్రాళ్లకు జగన్ అందిస్తున్న గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
ఇప్పటి కుర్రాళ్లకు కావాల్సింది ఉద్యోగం. ప్రతి ఒక్కరూ ఇంజినీరింగ్ చదివేస్తున్న ఈ రోజుల్లో ఉపాధి మాత్రం కొద్దిమందికే దొరుకుతోంది. కానీ.. పరిశ్రమలకు ఉద్యోగులు కావాలి.. నిరుద్యోగులకు ఉద్యోగం కావాలి. ఈ రెండింటిని సమన్వయం చేసేవే జాబ్ మేళాలు. అలాంటి ఓ మెగా జాబ్ మేళా విశాఖలో నిర్వహించబోతున్నారు. ఈ  జాబ్‌మేళాలో దాదాపు 25 వేల ఉద్యోగాలు రాబోతున్నాయ‌ట. ఈ విషయాన్ని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల విజయసాయి రెడ్డి తెలిపారు.


విశాఖ పట్నంలో ఈ శని, ఆదివారాలు అంటే.. 23, 24 తేదీల్లో మెగా జాబ్ మేళా ప్రారంభించారు. ఈ జాబ్ మేళా కోసం 206 కంపెనీలు రిజిస్టర్‌ చేసుకున్నాయట. ఈ జాబ్ మేళాను అవసరం అయితే, సోమవారం కూడా నిర్వహిస్తామని విజయసాయి రెడ్డి చెబుతున్నారు. ఇక్కడ ఇప్పటికే  77 వేల మంది ఉద్యోగార్థులు తమ పేర్లు రిజిస్టర్‌ చేసుకున్నారట. మొత్తం ఈ జాబ్ మేళా ద్వారా 23,935 ఖాళీలు ఇక్కడ భర్తీ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ జాబ్ మేళా సక్సస్ అయితే..  కుటుంబంలో నలుగురిని లెక్క వేసుకున్నా, దాదాపు లక్ష మంది ముఖాల్లో చిరునవ్వులు ఖాయం అంటున్నారు విజయసాయిరెడ్డి.


ఈ జాబ్ మేళాలో 206 కంపెనీలకు 206 రూమ్‌లు కేటాయించారు. ఇక ప్రతి రూమ్‌ వద్ద ఆ కంపెనీకి సంబంధించి వివరాలు ప్రదర్శిస్తారట. ఏ ఉద్యోగాలు ఉన్నాయి.. ఏయే అర్హతలు కావాలి.. అనే విషయాలు ఆ రూమ్‌ దగ్గర ప్రదర్శిస్తారు. అలాగే ప్రతి బ్లాక్‌లో వేర్వేరుగా ఫార్మా, ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్‌టైల్స్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్‌ తదితర విభాగాలకు  రూమ్‌లు కేటాయించారు. ఈ జాబ్ మేళా కోసం 13 భవనాల్లో 206 గదులు సిద్దం చేశారు.


ఇక ఈ జాబ్ మేళాకు వచ్చిన 206 కంపెనీలకు ఒకొక్కరికి 4గురు వలంటీర్లను కేటాయించారు. అలాగే ప్రతి భవనానికి 5గురు టీచర్లను నియమించారు. అంటే మొత్తం 860 మంది వలంటీర్లు ఈ జాబ్ మేళాలో సేవలు అందిస్తున్నారు. అవసరమైన పక్షంలో  సోమవారం కూడా జాబ్ మేళా నిర్వహించి 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా చూస్తామంటున్నారు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: