యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను బీజేపీ సొంతం చేసుకోవాలని యోచిస్తుంది.జగన్ మా వాడే అన్న భావనకు ఎప్పటి నుంచో ఎక్కువ ప్రాధాన్యమే ఇస్తుంది.
ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలు ఎవ్వరూ ఎప్పుడూ జగన్ ను ఏమీ అనరు.ఎందుకంటే వాళ్లంతా జగన్ ను అంత ప్రేమగా చూడడమే.మళ్లీ ఎందుకంటే వాళ్లకు రాజకీయ ప్రాధాన్యాలు ఉండడమే! అందుకనో ఎందుకనో ఢిల్లీలోనే సాయిరెడ్డి ఉండిపోవాలని పరితపిస్తున్నాడు.ఆ కారణంగానే సాయి రెడ్డి రాజకీయం ఢిల్లీ నగరి దడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.విశాఖ బాధ్యతల నుంచి ముఖ్యంగా ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించాలని యోచిస్తున్నకారణం కూడా ఇదే!ఇదే దశలో బీజేపీతో ఫ్రెండ్ షిప్ పెంచుకుంటే వస్తున్న కాలంలో కూడా అంతా మంచిగానే ఉంటుందని భావిస్తున్న జగన్ ను బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తెగ ప్రశంసిస్తున్నారు.
నిన్నటి వేళ ముఖ్యమంత్రి లాంఛ్ చేసిన ఈబీసీ నేస్తం (అగ్రవర్ణ పేద మహిళలకు ఒక్కొక్కరికీ 15 వేలు చొప్పున అందించేందుకు సన్నాహం) ఇందుకు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల వెచ్చింపు.ఈ పథకం గురించి విని,చదివి విష్ణు కుమార్ రాజు పొంగిపోతున్నారు.ఈ పథకం కారణంగానే లక్షలాది మంది మహిళలకు ఎంతో మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం సమయోచితం మరియు సందర్భోచితం అని విష్ణు కుమార్ రాజు ప్రశంసించారు.
ఇదే సందర్భంలో అటు బ్రాహ్మణ సంఘం కూడా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతించి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గా ప్రసాద్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మిగతా అగ్ర వర్ణాల రాజకీయ ప్రతినిధుల నుంచి కూడా జగన్ కు ఊహించని విధంగా మద్దతు వస్తోంది.గతంలో బీసీ మహిళలకు మాత్రమే సాయం అందేది.కానీ ఇప్పుడు జగన్ తన రూటు మార్చి అగ్ర వర్ణ పేద మహిళలకు కూడా సాయం చేసేందుకు ముందుకు రావడం ఓ శుభ పరిణామం అని ఆయా వర్గాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తుండడం వైసీపీకి రానున్న కాలంలో రాజకీయంగా ఎంతో కలిసి వచ్చే అంశం.