భాగ్యనగరంలో నిమజ్జనానికి ఏర్పాట్లు
హైదరాబాద్లో 5 అడుగుల లోపు విగ్రహాలను నిమజ్జనం చేయడానికి 25 చోట్ల బేబీ పాండ్స్ సిద్ధం చేశారు. హుస్సేన్ సాగర్లో భారీ వినాయకులను నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జనం కోసం 40కి పైగా భారీ క్రేన్స్ ఏర్పాటు చేశారు. శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సాగర్ చుట్టూ కొత్తగా కట్టిన నిర్మాణాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాగర్లో నిమజ్జనం తర్వాత వ్యర్థాలు వెంటనే తీసివేసేలా ఆధునిక యంత్రాలను సిద్ధంగా ఉంచారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం పాయింట్ల వద్ద భారీ క్రేన్లను ఏర్పాటు చేయడంలో నిమగ్నం అయ్యారు.
హుస్సేన్ సాగర్తోపాటు సరూర్ నగర్ చెరువులో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. వేగంగా నిమజ్జనం పూర్తి చేసేలా ప్రతి గణనాథుడికి ఇప్పటికే పోలీసులు జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. బాలాపూర్ గణనాథుడిని ఆదివారం ఉదయం బొడ్రాయి వద్దకు చేర్చి... అక్కడ లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు. చార్మినార్ మీదుగా హుస్సేన్ సాగర్కు గణనాథుడిని తరలిస్తారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడిని మధ్యాహ్నం రెండు గంటల లోపు నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు.