`దళిత బంధు` ధరఖాస్తుకు ప్రత్యేక యాప్.. వివరాలివే..!
ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నియోజవర్గంలో రూ. 2 వేల కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 26న సీఎం కేసీఆర్ సారథ్యంలో దళిత బంధు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిసిందే. ఈ సమావేశంలో పథకం అమలుకు మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉంది.
ఈ పథకంలో ఇతర ప్రయోజనాలు పొందని కుటుంబాలను మాత్రమే లెక్కలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ పథాకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజవర్గంలో అమలు చేసిన తర్వాత దీన్ని రాష్ట్రమంతటా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఈ పథకం కోసం రూ.1200 కోట్లను కేటాయించినట్లు ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మొదటి విడుతలో ప్రతి నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా 11,900 కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసింది. రైతుబంధు పథకం లాగానే నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది.
హుజూరాబాద్ ఎన్కికల వేళ ప్రవేశపెట్టనున్న ఈ పథకాన్ని అత్యంత పారదర్శంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పథకం దరఖాస్తు కోసం ప్రత్యేక యాప్ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్లికేషన్ రూపొందించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(CGG) కి అప్పజెప్పింది. యాప్ తో పాటు, వెబ్ పోర్టల్ ను ఈ నెల చివరిలోగా రూపొందించి అందుబాటులోకి తీసుకురావాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.