హైదరాబాద్లో ఓ కొత్త బ్యాంక్.. తెలంగాణలోనే ఫస్ట్ టైమ్..!
ఈ బ్యాంక్ ఎక్కువగా శరీరం కాలిన గాయాలతో బాధపడేవారికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, హెటిరో చైర్మన్ పార్థసారథి రెడ్డి, ఉస్మానియా ఆస్పత్రి సుపెరిండెంట్, వైద్యులు పాల్గొన్నారు. 200 మంది కాలిన గాయాల వారికి చర్మం అందించే సామర్థ్యంతో ఈ స్కిన్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు.. ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు శరీరం బాగా కాలిపోతుంది. అప్పుడు ప్రాణాలు కాపాడాలంటే ఎక్కువ చర్మం అవసరం.
ఈ స్కిన్ బ్యాంక్ ను ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ అలీ.. ఉస్మానియా పేదలకు అత్యున్నత వైద్య సేవలు అందిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని.. ఇటివలే నగరంలో వైద్య సదుపాయాలు పెంచేలా మెడికల్ కాలేజీలను ప్రకటించారని గుర్తు చేశారు. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం కట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్న హోం మంత్రి మహమూద్ అలీ.. ఆర్కిటెక్చర్, పేరు అలాగే ఉండేలా కొత్త భవనం రాబోతోందన్నారు.
అవయవ మార్పిడి చేసేలా ఉస్మానియాలో వైద్య సదుపాయాలు ఉన్నాయని గుర్తు చేసిన హోం మంత్రి మహమూద్ అలీ.. కాలిన గాయాలతో వచ్చే వారికి చర్మం సమస్యగా మారుతుందని.. కొన్నిసార్లు ఇది మరణాలకు దారితీస్తుందని అన్నారు. ఇప్పుడు స్కిన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం శుభపరిణామని.. రూ. 50 లక్షలతో స్కిన్ బ్యాంక్ ఏర్పాటుకు హెటిరో ముందుకు రావడం అభినందనీయమని హోం మంత్రి మహమూద్ అలీ ప్రశంసించారు.