సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి సెటైర్లు వేశారు. కేసీఆర్ మాట్లాడటం తప్ప పనులు చేయరని వ్యంగ్యాస్త్రాలు కురింపించారు. ఇటీవల సీఎం కేసీఆర్ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల్ని తానే స్వయంగా చెకింగ్ చేస్తానని...ఆఫీసర్లు అందుబాటులో ఉండి తానడిగిన రిపోర్టులివ్వాలని... తేడా వస్తే స్పాట్లోనే సస్పెన్షన్లు ఉంటాయని సీరియస్గా హెచ్చరించారు. కానీ సీఎం మాటలకు భయపడాల్సిన పనిలేదని అధికారులకు బాగా తెలుసని రాములమ్మ పేర్కొన్నారు. ఎందుకంటే, ఆయన ఒక మాట అన్నారంటే... అది జరిగే పని కాదని అందరికీ తెలుసని కామెంట్ చేశారు. వస్తున్నా వస్తున్నా అనడమే గాని... ఓట్ల పండగప్పుడు తప్ప ఫాంహౌస్, ప్రగతి భవన్ వదిలి కేసీఆర్ రారని అందరికీ బాగా అర్థమైందని వ్యాఖ్యానించారు. సాగర్ ఎన్నికలప్పుడు 15 రోజుల్లో మళ్ళీ సాగర్ వచ్చి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అని ఇప్పటి వరకూ అతి గతీ లేదని అన్నారు.
అంతకు ముందు హుజుర్ నగర్ ఎన్నికలప్పుడు వచ్చి 15, 20 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వరకు పర్యటించి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని చెప్పారని... ఏడాదిన్నరైనా సారు అడ్రస్ లేడని అన్నారు. ఇక చాలా ఏళ్ళ కిందట వరంగల్ నగరం మురికివాడలకు వచ్చి... వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని చెప్పి ఏం చేశారో చెప్పన్నక్కర్లేదని అన్నారు. ఇక ఈ తాజాగా చెకింగులు, వార్నింగుల అర్థమేంటో నేను చెప్పాల్సిన పనిలేదంటూ విజయశాంతి అన్నారు. ఆయన దర్శనం కావాలంటే మళ్ళీ అక్కడ ఓట్ల పండగ రావాలేమోనని అన్నారు... కాదు, తప్పదు అనుకుంటే ఏవో కొన్ని చోట్లకు వెళ్ళి ముఖం చూపించి తిరిగిరావడమే తప్ప, తెలంగాణను ఉద్ధరిస్తారంటే చిన్న పిల్లలు కూడా నమ్మే పరిస్థితి లేదన్నారు. అయినా, వెళితే మంచిదే.
ఎంతమంది ఉద్యోగాలు, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్ళు, నిర్వాసితుల పరిహారం బాధితులు, ఇంకా... ధాన్యం కొనుగోళ్ళు కాక నష్టపడిన రైతులు సీఎం గారిని అడ్డుకుంటారో సీఎంకు తెలిసివస్తుందన్నారు. కానీ, బాధాకరం ఏమిటంటే, ఇక వారిపై ఈ ముఖ్యమంత్రి గారి జులుం, కుక్కలు, చెప్పులు అంటూ శాపనార్థాలు పెడతారని అన్నారు. అంతే కాకుండా కవర్ చేసిన జర్నలిస్టులపై కూడా కేసులు, జైళ్ళు...లాంటి చిత్ర విచిత్ర తిక్క తుగ్లక్ విన్యాసాలన్నీ చూపించవచ్చని అన్నారు. అలాగే ఈ సీఎం గారు సెక్రెటేరియట్ వెళ్ళి చూస్తే కూల్చివేత.... ప్రగతి భవన్కు పంపితే పక్క భవనాల కూల్చివేత అంటూ చురకలు అంటించారు. వఇప్పుడు జిల్లాలలో ఏమేమి కూలుస్తాడో అని ప్రజలు భీతిల్లే పరిస్థితులు కూడా వినబడుతున్నాయ్ అంటూ విజయశాంతి ఆరోపించారు.