పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇవిగో వివరాలు..!

Chakravarthi Kalyan
కరోనా ఉధృతి నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. అందుకే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అందరినీ ఉత్తీర్ణులను చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు  నిర్ణయం మేరకు అందరిని ఉత్తీర్ణులను చేయడం జరిగిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయించారు.  పదో తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న  5, 21,073  మంది విద్యార్థులను ఉత్తీర్ణులను చేసినట్లు మంత్రి తెలిపారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు.. 4,495 మంది గతంలో  ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారని  అన్నారు. రెగ్యులర్ గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,62,917 మంది విద్యార్థులు బాలురు కాగా, 2,53,561 మంది విద్యార్థులు బాలికలు ఉన్నారు.
2,10,647 మంది విద్యార్థులు  10/10 జి.పి.ఎ. సాధించినట్లు మంత్రి  వెల్లడించారు. మొత్తం 535  పాఠశాలలు 10/10 జి.పి.ఎ. సాధించాయని వెల్లడించారు.  ఇంటర్నల్ అసెస్మెంట్  మార్కుల ఆధారంగా కేటాయించిన గ్రేడ్ ల వివరాలను  WWW .bse .telangana .gov .in  మరియు  http .// results .BSETELANGANA .ORG వెబ్ సైట్ లలో సాయంత్రం మూడు గంటల నుంచి పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు.

విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని మంత్రి సూచించారు.  విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్.ఎస్ .సి. బోర్డుకు పంపితే వెంటనే సరిదిద్దడం జరుగుతుంది. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్ లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని  తమ భవిష్యత్ ను బంగారుమయం చేసుకోవాలని మంత్రి కోరారు. 2020-21 విద్యా సంవత్సరంలో భౌతిక తరగతుల నిర్వహణ సాధ్యం కాని సమయంలో డిజిటల్ తరగతులను నిర్వహించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, ఇది గౌరవ ముఖ్యమంత్రికి విద్యా రంగం పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని  మంత్రి అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: