నడిరోడ్డుపై నరికినా పట్టించుకోలేదు.. ఈటల గురించే అరెస్టు చేశారా..?

Chakravarthi Kalyan
పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అరెస్టు అయ్యారు. ఆయన గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయారు. పోలీసులు ఆయన జాడ కనిపెట్టి భీమవరంలో అరెస్టు చేశారని చెబుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఈ పుట్ట మధు.. న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో  కీలక నిందితుడుగా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఏకంగా పుట్ట మధు అల్లుడు బిట్టు శీనును ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు కూడా.


పుట్ట మధుయే ఈ హత్యలు చేయించాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు బిట్టు సీను హంతకులతో మాట్లాడుతున్న ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. కానీ.. అప్పట్లో ప్రభుత్వం పుట్ట మధు జోలికి రాలేదు. ఆయన చాలా రోజులు అధికారిక కార్యక్రమాల్లో దర్జాగా పాల్గొన్నారు. న్యాయవాదుల హత్యపై హైకోర్టు కూడా సీరియస్ అయ్యింది. త్వరగా దోషులను పట్టుకోవాలని ప్రభత్వానికి సూచించింది. అయినా కేసు విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు.


అలాంటింది.. ఇప్పుడు అనూహ్యంగా పుట్ట మధును న్యాయవాది కేసులోనే అరెస్టు చేశారు. మరి ఇన్నాళ్లూ బయట తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు ఇప్పుడు ఎందుకు పుట్ట మధుని అరెస్టు చేశారు. ఇన్నాళ్లూ ఎందుకు పట్టించుకోలేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుట్ట మధు అరెస్టు వెనుక రాజకీయ కోణం కూడా ఉందన్న వాదన వినిపిస్తోంది. పుట్ట మధు ఈటల రాజేందర్‌కు సన్నిహితంగా ఉంటారని పేరుంది. అందుకే ఇన్నాళ్లూ లాయర్ల హత్య కేసులో పుట్ట మధుని పెద్దగా పట్టించుకోని పోలీసులు ఇప్పుడు అరెస్టు చేశారన్న వాదన వినిపిస్తోంది.


కొన్ని రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ అధికారుల బదిలీలు కూడా జోరుగా సాగుతున్నాయి. పోలీసులు అధికారులు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు.. ఇలా అన్ని స్థాయిల్లో బదిలీలు జరుగుతున్నాయి. ఈటలకు  అనుకూలంగా ఉండే వారిపైనే ఈ బదిలీలన్న విమర్శలు ఉన్నాయి. ఈటలను ఐసోలేషన్ చేసే ప్రక్రియలోనే పుట్ట మధును అరెస్టు చేసి ఉండొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: