ఎందుకు పట్టించుకోవట్లేదు...? ఏపీ సర్కార్ పై హైకోర్ట్ ఫైర్
గత ఏడాది సెప్టెంబర్లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. ప్రాధాన్యతా అంశాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ హైకోర్ట్ ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా సెకండ్ వేవ్ కేసులు, పరీక్షలు, ఫలితాలు, పడకల అందుబాటు, అత్యవసర మందులు తదితరం అంశాల పై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన ప్రవేటు ఆసుపత్రుల పై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదించాలని హైకోర్టు ఆదేశించింది.
ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన తోట సురేష్ బాబు... పిటీషన్ పై నేడు విచారణ జరిగింది. రెమిడేసీవర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్లోకి వెళ్లటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వివరించారు. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకటం లేదని శ్రీనివాస్ వివరించారు. ఈ వివరాలన్నింటితో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 27వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయకపోతే ప్రభుత్వం పై తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యలు చేసారు.