న్యాయవ్యవస్థలోనూ క్విడ్ ప్రో కో..? నివ్వెరపోయే నిజాలు..?
ఎందుకంటే.. మోడీ సర్కారు హయాంలో ఆయనకు అనేక రకాలుగా మేలు చేసిన న్యాయవ్యవస్థలోని వ్యక్తులకు ఆ తర్వాత మోడీ పీఎం అయ్యాక వరుసగా మేలు జరుగుతోంది. దీన్ని న్యాయవ్యవస్థలోని క్విడ్ ప్రోకో అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా అనేక నిదర్శనాలు చూపుతున్నారు. అందులో మొదటిది కొన్నాళ్ల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయ్యిన రంజన్ గగోయ్.. తన పదవీ కాలంలో మోడీ సర్కారుకు మేలు చేసేలా అనేక తీర్పులు ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. ఆయనకు పదవీవిరమణ తర్వాత బీజేపీ సర్కారు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించడమూ వివాదాస్పదమైంది.
అలాగే ఫేక్ ఎన్కౌంటర్ కేసు నుంచి అమిత్ షాకు క్లీన్ చిట్ ఇచ్చినందుకు జస్టిస్ సదాశివంకు ఆ తర్వాత కాలంలో ఆయన రిటైర్ అయ్యాక కేరళ గవర్నర్ గా పదవి ఇచ్చారన్న ప్రచారం ఉంది. ఇదే కేసులో అమిత్ షా తరపున వాదించిన లాయర్ యుయు లలిత్.. ఆ తర్వాత కాలంలో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అలాగే మోడీ రాజకీయ జీవితంలోనే మచ్చగా నిలిచిపోయే గోద్రా మారణ హోమం కేసు నుంచి క్లీన్ చిట్ ఇచ్చిన వైసీ మోడీ ఆ తర్వాత కాలంలో ఎన్ఐఏకు చీఫ్గా నియమితులయ్యారు. ఇదే కేసులో మోడీకి అనుకూలంగా పని చేసిన మాజీ పోలీస్ బాస్ ఆర్కే రాఘవన్ కూడా ఆ తర్వాత కాలంలో సైప్రస్ దేశానికి హైకమిషనర్ గా నియమితులయ్యారు.
యూపీఏ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ కేసులో లక్షల కోట్ల స్కామ్ స్కామ్ జరిగిందని నివేదిక ఇచ్చిన అప్పటి కాగ్ వినోద్ రాయ్కు మోడీ అధికారంలోకి వచ్చాక బీసీసీఐ అధ్యక్ష పదవి దక్కింది. అలాగే పద్మభూషణ్ కూడా వరించింది. ఇలాంటి ఉదాహరణలు కూడా క్విడ్ ప్రో కో కేసుల కిందకే వస్తాయంటున్నారు జనం.