వైసీపీ వర్సెస్ టీడీపీ... ఆ ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లతో వేడెక్కిన రాజకీయం..!
ఇక తాజాగా ఇప్పుడు ఈ ఆరోపణల వంతు కడప జిల్లాకు పాకింది. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధాన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. 2014లో రామిరెడ్డిపై జనార్థన్ రెడ్డి విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో జనార్థన్ రెడ్డి ఓడిపోగా.. కాటసాని రామిరెడ్డి విజయం సాధించారు. జనార్థన్ రెడ్డి మొత్తంగా 22 కేసుల్లో నిందితుడిగా ఉన్నారని ఆరోపించిన రామిరెడ్డి.. ఆయన ఓ భూ కబ్జాదారుడు అని ... ఆయనపై ఉన్న కేసులను కావాలంటే ఎఫ్ ఐ ఆర్ లో కూడా చూపిస్తానని సవాల్ విసిరారు.
ప్రస్తుతం బనగానపల్లెలో ఆయన ఉంటోన్న ఇళ్లు కూడా కబ్జా చేసిందే అని విమర్శించారు. తనపై వచ్చిన విమర్శలకు జనార్థన్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. ప్రభుత్వ స్థలాలను కూడా ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన ఘనత కాటసానిదే అని మండి పడ్డారు. ప్రతి రియల్ వెంచర్ నుంచి కూడా ఆయన కమీషన్లు దండుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు.
ఎవరైనా ఎమ్మెల్యే అక్రమాలను ఎత్తి చూపితే వారిపై అక్రమ కేసులు పెడతానని బెదిరిస్తున్నారంటూ జనార్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అక్రమాలపై తాను ఓపెన్ చర్చకు సిద్ధంగా ఉన్నానని.. దమ్ముంటే ఆయన తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. వీరిద్దరి సవాళ్లతో బనగానపల్లె రాజకీయం వేడెక్కింది.