జాక్ మా దొరికాడు.. వీడియో బయటపెట్టిన మీడియా!
జాక్ మా ఎక్కడికీ పోలేదని, ఆయన క్షేమంగానే ఉన్నారని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ బుధవారం ఓ వీడియోను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వందమంది ఉపాధ్యాయులతో జాక్మా వర్చువల్ భేటీ నిర్వహిస్తున్నారని, అందుకు ఈ వీడియోనే ఆధారంగా పేర్కొంది. ‘కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత మళ్లీ మనం కలుద్దాం’ అని ఆ గ్రామీణ ఉపాధ్యాయులతో జాక్ మా అంటున్నట్లు ఈ వీడియోలో ఉంది. అయితే వ్యాపారవేత్తలు మాత్రం ఈ వీడియోపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా టీవీ షోలకు గానీ, సోషల్ మీడియాకు గానీ జాక్మా దూరంగా ఉంటారని, అలాంటిది ఆయన హఠాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం అనుమానించాల్సిన విషయమేనని వారంటున్నారు.
ఇదిలా ఉంటే జాక్ మా గత అక్టోబరులో ఓ బహిరంగ సభలో టెక్నాలజీ గురించి, ఆవిష్కరణల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగానే చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై, బ్యాంకింగ్ రెగ్యులేటరీలపై విమర్శలు సంధించారు. దీంతో జాక్ మాపై చైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయన వ్యాపారాలపై విచారణకు ఆదేశించింది. అయితే ఆ సమావేశం తరువాత జాక్ మా మళ్లీ బయట ఎక్కడా కనపడలేదు. అంతేకాకుండా ఆయనే స్వయంగా నిర్వహించే ‘ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్’ అనే కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. దీంతో అనేక అనుమానాలు తలెత్తాయి.