వ్యాక్సిన్ తయారైంది హైదరాబాద్ లోనే : కేటీఆర్
18 సంవత్సరాలు పైబడిన వారందరూ ఈ వ్యాక్సిన్ ని తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. అయితే ఈ వ్యాక్సిన్ను మొదట ప్రజాప్రతినిధులకు కాకుండా ప్రధాని మోదీ సూచించినట్లుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందిస్తన్నామని కేటీఆర్ చెప్పారు. కొవాగ్జిన్ టీకా హైదరాబాద్లో తయారు కావడం గర్వకారణంగా ఉందన్నారు. సురక్షితమైన టీకాలను హైదరాబాద్ నగరం ప్రపంచానికి అందిస్తుందని తెలిపారు. ప్రపంచంలో వినియోగించే ప్రతి మూడు వ్యాక్సిన్లలో ఒక వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచి ఉత్పత్తి అయిందే ఉంటుందని పేర్కొన్నారు. టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికి టీకా రాజధానిగా హైదరాబాద్ మారిందన్నారు.
గత ఏడాది కరోనా వైరస్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ వ్యాక్సిన్ రావడం వల్ల అందరిలో విశ్వాసం పెరిగిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
అయితే ఈ వ్యాక్సిన్ తొలిరోజు 30 మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, తరువాత రోజు నుంచి పూర్తి స్థాయిలో పంపిణీ జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గడిచిన పది నెలలుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఒక యుద్ధంలాగా కరోనా వైరస్ కోసం పనిచేశారన్నారు. అందుకే మొదట వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. వారి ప్రాణాలకు తెగించి కరోనా విజృంభిస్తున్న సమయంలో వారు చేసిన సేవలను గుర్తించి ముందుగా ఈ వ్యాక్సిన్ను వారికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం జరిగిందని కేటీఆర్ వెల్లడించారు. ఆ తర్వాత అందరూ కరోనా టీకా తీసుకోవచ్చునని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.