వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదు.. డబ్ల్యూహెచ్వో కీలక వ్యాఖ్యలు..?
ప్రస్తుతం వివిధ దేశాలలో శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్న వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించడంలో వ్యాక్సిన్ ఒక్కటి మాత్రమే అడ్డుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ పై పోరాటంలో మన వద్ద ఉన్న ఇతర సాధనాలను కూడా సంపూర్ణత ఇస్తుంది తప్ప భర్తీ చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు.
వ్యాక్సిన్ పంపిణీపై మొదట్లో పరిమితులు ఉంటాయి అంటూ స్పష్టం చేసిన ఆయన.. కరోనా వారియర్స్ వృద్ధులు వైరస్ ప్రభావం అధికంగా ఉన్నవారికి మాత్రమే తొలి ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. ఇలా వ్యూహాత్మకంగా వెళ్లడం ద్వారా మరణాల సంఖ్య తగ్గుతుందని... తద్వారా వ్యాక్సిన్ పంపిణీని మరింత విస్తరించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందరి ముందు ఉన్న సవాల్ కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించడమే అంటూ గుర్తు చేశారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఇటీవలే అత్యధికంగా ఒక్కరోజులోనే ఆరు లక్షల 60 వేల 905 కేసులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.