లోకేశ్‌కు ఊహించని షాక్ ఇచ్చిన జగన్ ఫ్యాన్స్..?

Chakravarthi Kalyan
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కొడుకుగా తప్ప.. తనకంటూ సొంత బ్రాండ్ వేసుకోని ఆయన కుమారుడు నారా లోకేశ్.. ఇప్పుడు కాస్త జనంలోకి వస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ హైదరాబాద్ లోని ఇంటికే తండ్రీ కొడుకులు పరిమితం అయ్యారన్న విమర్శలు బాగా వినిపించాయి. దీంతో ఆయన మొత్తానికి హైదరాబాద్ నుంచి కదిలారు. తాజాగా కృష్ణా, గోదావరి నదలకు వరదలు రావడంతో.. ముంపు బాధితులు పరామర్శించేందుకు నారా లోకేశ్ పర్యటనలు చేస్తున్నారు.
అదే విధంగా ఆయన తాజాగా.. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే బాధలో ఉన్నవారిని పరామర్శించేందుకు వెళ్తున్న వారు ఎలా ఉండాలి.. వారి బాధను పంచుకునేలా ఉండాలి.. కానీ లోకేశ్ పర్యటన అందుకు భిన్నంగా సాగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ నేతలు పెద్ద పెద్ద పార్టీ జెండాలు పట్టుకుని.. జై తెలుగు దేశం.. జై చంద్రబాబు, జై లోకేశ్ అంటూ నినాదాలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. దీంతో ఇది పరామర్శల పర్యటనగా కాకుండా ఏదో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు కనిపించింది.
మొత్తానికి ఈ వ్యవహారం వైసీపీ కార్యకర్తలకు చిరాకు తెప్పించింది. అంతే పోటాపోటీగా వారూ నినాదలకు దిగారు.. టీడీపీ నాయకులు జై చంద్రబాబు, జై లోకేశ్ అంటే.. వైసీపీ ఫ్యాన్స్ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఇరు వర్గాల నినాదాలతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత పోలీసులు సీన్ లోకి వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.
అయితే.. ‘జై జగన్.. జై జై జగన్’ అంటూ నినాదాలతో టీడీపీ క్యాడర్‌ను వైసీపీ క్యాడర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటున్నారు తెలుగు దేశం అభిమానులు.. వైసీపీ నేతలు, కార్యకర్తలు తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. టీడీపీ నేతలు ఎవరూ రాష్ట్రంలో ఎక్కడా పర్యటించకూడదా..? అంటూ వైసీపీ నేతలను  టీడీపీ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అయితే పరామర్శలు పరామర్శల్లా ఉండాలని.. బల నిరూపణ కోసమో.. ఆధిపత్యం కోసమో పర్యటిస్తూ తామూ చూస్తూ  ఊరుకోబోమంటున్నారు వైసీపీ ఫ్యాన్స్. ఇదీ సంగతి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: