కరోనా వేళ.. కుర్రాళ్ల కొంప ముంచుతున్నది ఇదే.. జరజాగ్రత్త..?
వివరాల్లోకి వెళ్తే.. కొవిడ్ కారణంగా మృత్యువాత పడుతున్నవారిలో యువత ఎక్కువగా ఉంటున్నారు. నలభై ఏళ్లలోపు యువకుల మరణాలు ఎక్కువగా నమోదవుతుండటం ఇండియాహెరాల్డ్ పరిశీలనలో కనిపించింది. అంతే కాదు.. కొవిడ్ కారణంగా ఆస్పత్రి పాలవుతున్నవారిలో మధ్యవయస్సు వారు కూడా ఉంటున్నారు. అంతే కాదు.. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ కూడా ఇదే చెబుతోంది. యువకులు సైతం ఐసీయూలో చేరి చికిత్స పొందుతున్నట్లు సీడీసీ నివేదిక చెపుతోంది.
ఈ పరిస్థితి ఇండియాలోనే కాదు.. ఫారిన్లోనూ అంతేనట.. అమెరికాలోనూ ఇదే పరిస్థితి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లోనూ సగం కేసులు 50 ఏళ్లలోపువారివేనట. ఈ ఉదాహరణలు చూస్తే.. కరోనా కేవలం వృద్ధులకు మాత్రమే డేంజర్ అని భావించే పరిస్థితి లేదు. భారత వైద్యపరిశోధన మండలి నివేదికలు కూడా ఇదే చెబుతున్నాయి.
ఐసీఎమ్ఆర్ పరిశీలన ప్రకారం పాజిటివ్ రోగుల్లో 60 ఏళ్లు పైబడినవారు 17 శాతమే ఉన్నారు. 21-40 ఏళ్ల మధ్యవయస్కులు 42శాతం ఉన్నారు. ఇవే కాదు... ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ కూడా ఇదే చెబుతోంది. 35-64 మధ్య వయసుగలవారిలోనే కొవిడ్ మరణాలు అధికంగా ఉన్నాయని ఈ సంస్థ చెప్పింది. అయితే ఇలా యువత ఎక్కువగా కరోనా బారిన పడటానికి అసలు కారణంగా నిర్లక్ష్యమే అని తేలుతోంది. చాలా మందికి సింప్టమ్స్ లేకపోవడం.. వారి యథేచ్చగా తిరగడం.. వారి ద్వారా మిగిలిన వారికీ సోకడం అసలు సమస్యగా చెబుతున్నారు. అందుకే కుర్రాళ్లూ కాస్త జాగ్రత్త. కరోనా భయం ఇంకా పొంచే ఉంది సుమా.