ముఖ్యమంత్రి పేషీలోకి ఆ పేద మహిళలు ఎలా వచ్చారు ?
......................
మైక్రో ఇరిగేషన్ సమాచారం కోసం, హైదరాబాద్ సెక్రటేరియట్లోకి వెళ్లగా,
‘ సి బ్లాక్ ’ దగ్గర ఎదురైన సీన్ అది.
అధికారులు హడావడిగా, ఫైల్స్ పట్టుకొని లోపలి నుండి బయటకు వస్తుంటే, వారి వెనుకే పల్లె మహిళలు ఉన్నారు. ఒకరిని పకరిస్తే… ‘‘ రంపచోడవరం ఏజెన్సీ నుండి వచ్చామండీ, సీఏం గారు కబురుచేశారు.’’ అందామె. మామూలు గా అయితే బడా కార్పొరేట్ కంపెనీ బాసులు సీఏం పేషీలో మీటింగ్కు వస్తుంటారు. దీనికి భిన్నంగా మన్యంలో మట్టి పనులు చేసుకొనే, అతి మూమూలు మహళలుకు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ ఇవ్వడం ఏమిటి? దీని వెనుకున్న ముచ్చటేమిటో, తెలుసుకోవాలనుకొని... ఆ తరువాత వేరే పనుల్లో పడి మరిచిపోయా...
సీన్ కట్ చేస్తే...
సంవత్సరం తరువాత ఒక రోజు నాబార్డ్ సీజీఎం మోహనయ్యగారు పిలిచారు.
‘‘ ఒక ఇంట్రస్టింగ్ కేస్ స్టడీ ఉంది. ఏలేరు నది మీద మహిళలు పవర్ ప్రాజెక్ట్ పెట్టారు. దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాం... మీరు స్టోరీ చేయాలి. ’’ అని, రెండు పేజీ ల నోట్ ఇచ్చారు.
.............
ఉదయం నాలుగింటికే రాజమండ్రి చేరుకొని అక్కడి నుండి కారులో రంపచోడవరం వైపు బయలు దేరాం. దాదాపు 120 కిలోమీటర్లు ... కొండలు కోనలు దాటి వెళ్తున్నాం.
ఉదయపు వేళ మంచు ముసుగులో పొలాల్లో కూలి పనులు చేస్తూ... కట్టెలు ఏరుతూ...జీడిమామిడితోటల్లోకి వెళ్తూ, జీలుగ చెట్ల మీద నీరా తీస్తు ...
అక్కడి ప్రజల జీవనం పచ్చగా, ఆహ్లాదంగా ఉంది.
వంపులు తిరిగిన ఏలేరు ప్రవాహం చూడగానే దిగి మునకు వేయాలనిపించింది, కానీ సమయం లేక ముందుకు సాగాం. రంపచోడవరం ఏజెన్సీలో గిరిజనుల జీవధార. అన్ని కాలాల్లోనూ ప్రవహించే జీవనది. ఈ నది ఒడ్డునే ఉన్న వేటమామిడిలో, పవర్ ప్రాజెక్టు నిర్మించారు.
పక్క గ్రామం వారు, వేటమామిడి రావడం అంత ఈజీ కాదు.
చిక్కని అడవుల మధ్య అడ్డతీగ సమీపంలో తణుకురాతిపాలెం నుండి, ఏలేరు నదిని నడుం లోతు నీళ్లలో దాటాలి.
ఇలా ప్రతీ రోజు ఉదయం అడ్డంగా ప్రవహించే నీళ్లను దాటి వేటమామిడి చేరుకొని అవే జలాల నుండి విద్యుత్ తీసే ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు కొందరు మహిళలు.
వాళ్లను పలకరించి, ఆ గ్రామంలోకి చేరుకున్నాం.
రోడ్డు పక్కనే పెసరట్లు వేస్తున్నారు. పెనం మీద అవి కాలుతుంటే, సన్నగా తరిగిన, అల్లం, పచ్చిమిర్చి,పుదీనా, చల్లు తున్నారు. సత్తు గిన్నెలోని ఇప్పనూనెను కొబ్బరి చిప్ప గరిటతో, రౌండ్గా పోసి, అట్లు తిరగేసి లేత అరిటాకులో వేసి చేతిలో పెట్టారు. ఉప్మా కావాలంటే పెట్టు కోవచ్చు. ఛాయిస్ మనదే... నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి.
‘‘ ఇక్కడ ఐదొందల కుటుంబాలు వరకు ఉంటాయండే. చేపల వేట, జీలుగకల్లు, వరి, జీడిమామిడి పంటలే మాకాధారం. ఎవరికీ పెద్దగా సదువుల్లేవండీ బాబూ !!’’ పక్కనే పిండి రుబ్బుతున్న ఆమె ఊరిని పరిచయం చేసింది.
అలాంటి గిరిజనులే ఏకంగా ఒక విద్యుత్ ప్రాజెక్టును నడపడం.. ఊళ్లోవాళ్లే నమ్మలేని ముచ్చట .
సమీపంలోని, జవిద్యుత్ ప్రాజెక్ట్కి చేరుకున్నాం.
లోపల మిషన్కి రిపేర్లు చేస్తున్నారు నలుగురు మహిళలు. అరగంట తరువాత మాకు ప్లాంట్ని చూపించి, అక్కడి విశేషాలు చెప్పారు.
ఆ రోజు సెక్రటేరియట్లో చూసిన వాళ్లే వీరంతా... అప్పటి మీటింగ్లో సీఎంతో తీసుకున్న ఫోటోలు చూపించింది సత్యవతి. ఈ టీమ్కి ఆమె బాస్.
‘మా ఊరి పక్కనే పారే ఏలేరులో చేపలు పట్టుకోవడమే మాకు తెలుసు. ఇప్పుడు, ఇవే నీళ్లతో కరెంట్ ను సృష్టించడం వింతగా అనిపిస్తుంది..’ అని సంతోషంగా చెప్పింది, బట్టు రాజేశ్వరి.
‘‘ ఈ ప్రాజెక్టు నిర్వహణకు మాతో ఒక కమిటీ ఏర్పడింది . పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించాం. యంత్రాలు ఎలా వాడాలో తె లుసుకున్నాం. విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టిన తర్వాత.. మాలో ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం వచ్చింది.’ అన్నారు, ట్రైబల్ విమెన్ పవర్ ప్రాజెక్టు కమిటీ అసోసియేషన్ ఆఫ్ ది వేటమామిడి’సభ్యులు మద్దికొండ దేవకాంతమ్మ, మడకం లక్ష్మి.
సహజసిద్ధమైన జపాతాలు , నదులు, వాగులు వంకల్లో పారే నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం, ఆ ఆదాయంతో స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగు పరచడం లక్ష్యంగా ఏపీ గిరిజన విద్యుత్ సంస్థ ఈ మినీ హైడల్ పవర్ ప్రాజెక్టు నెలకొల్పింది. నిర్మాణానికి అవసరమైన నిధులు నాబార్డ్ ఇచ్చింది.
....................
అంతా బాగుంది కానీ, ఇంతకూ వీరితో ఆనాడు మీటింగ్ జరిపిన సీఎం ఎవరనే కదా మీ సందేహం...
ఈ మహిళా శక్తిని గుర్తించి, ఏకంగా విద్యుత్ శక్తిని సృష్టించే పని అప్పగించింది,
2007లో ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే కష్టపడి పనిచేయమని, వీరికి గుడ్డి దీపాలను మాని.. గూడేన్ని వెలిగించడం నేర్పారు.
తాము వెలిగి.. పదిమంది జీవితాలనూ దేదీప్యమానం చేయడమూ తెలుసుకున్నారు కానీ, ఇంత చేస్తున్నా... వీరికిచ్చే గౌరవ వేతనం చాలా స్వల్పం. అదేమీ ఆలోచించకుండా, ఊరి బాగు కోసం, ఒక పూట ప్లాంట్లో పనిచేస్తూ, మరోపూట కూలికి వెళ్తున్న వీరికి ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉంది.
సెప్టెంబర్ 2, వై.ఎస్. వర్ధంతి.
( శ్యాంమోహన్, సీనియర్ జర్నలిస్ట్, 9440595858)