ఇంతకీ జగన్ కొత్త పాలసీతో.. ఏపీ ఫ్యూచర్ ఏంటి...?
జగన్ సర్కారు ఇటీవల ఓ కొత్త పారిశ్రామిక పాలసీని విడుదల చేసింది. గతంలో చంద్రబాబు సర్కారు చెప్పిన దానికి భిన్నంగా ఈ పాలసీ ఉంది. మేం ఎక్కువగా భ్రమల్లో ఉంచం.. లక్షల కోట్ల పెట్టుబడులు రప్పిస్తామని చెప్పం.. కానీ.. అందుకు అనువైన వాతావరణం సృష్టిస్తాం అంటున్నారు ఈ పాలసీని రూపొందించిన సర్కారు పెద్దలు.. మరి ఈ పాలసీతో ఏపీకి వచ్చే లాభం ఏంటి.. ఓసారి చూద్దాం..
ఈ కొత్త పాలసీ ద్వారా ఓ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన మొదలు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా జీవితకాలం అండగా నిలిచే విధంగా దేశంలోనే తొలిసారిగా ‘వైయస్సార్ ఏపీ వన్’ను ప్రవేశ పెట్టామని వైసీపీ సర్కారు చెబుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి నష్టభయం లేకుండా హ్యాండ్ హోల్డింగ్ కల్పించాలన్న ముఖ్యమంత్రిజగన్ సూచనల మేరకు 2020–23 నూతన పారిశ్రామిక విధానంలో ‘వైయస్సార్ ఏపీ వన్’ను పొందుపరిచామని చెబుతోంది.
మహిళా సాధికారితలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు నెలకొల్పే పరిశ్రమలకు అధిక రాయితీలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానం రూపొందింది. దీనివల్ల ఆయా వర్గాల నుంచి పారిశ్రామిక వేత్తలు తయారయ్యే అవకాశం కలుగుతోంది. ఇది సామాజిక వికాసానికి దారి తీస్తుందని చెప్పొచ్చు. అలాగే... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా రంగాలవారీగా క్లస్టర్ల విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమల యజమానులకు నిర్వహణ వ్యయం బాగా తగ్గేవిధంగా నూతన విధానం అవకాశం కల్పిస్తుందంటున్నారు పారిశ్రామిక వేత్తలు
విశేషం ఏంటంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇలా పారిశ్రామిక రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించడం ఆయా వర్గాల అభివృద్ధికి అవకాశం కల్పిస్తుంది. ఈ వైఎస్ఆర్ ఏపీ వన్ ద్వారా 10 కీలక సేవలను రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అందించబోతోంది. ఈ కొత్త విధానం ద్వారా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్టుబడి వ్యయం చాలా తక్కువయ్యే విధంగా అన్ని మౌలిక వసతులతో కూడిన పారిశ్రామిక పార్కులను క్లస్టర్ల విధానంలో అభివృద్ధి చేస్తారు.