ఏపీ: విపక్షాల దెబ్బకి ఖంగుతిన్న జగన్... ఏమీ చేయలేని వైనం?
అవును, ఒక ప్రముఖ మీడియా చానల్ ఇంటర్వ్యూలో భాగంగా జగన్ అనేక అంశాల మీద మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా తన ప్రభుత్వ హయాంలో 4 పోర్టులతో పాటు 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్స్ ని అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. పెట్టుబడులు చూస్తే తన హయాంలో లక్ష కోట్ల రూపాయల దాకా వచ్చాయని వివరించారు. దాంతో సదరు ఇంటర్వ్యూయర్ అవి పేపర్ వరకే పరిమితం అయ్యాయని మీ ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది అని అడగగా... వారిది చేతకానితనం! వారి హయాంలో చేయలేని అభివృద్ధిని నేను చేసానని వారి ఏడుపంతా! అని జగన్ సమాధానం చెప్పుకొచ్చారు. ఐతే అంత అభివృద్ధి చేసిన మీ ప్రభుత్వం వాటిని ఎందుకు ధైర్యంగా చెప్పుకోవడంలేదని యాంకర్ ప్రశ్నించగా తానే అనేక సభలలో చెప్పాను, కానీ విపక్షాలు... వారితో బలంగా జత కలసిన అనుకూల మీడియా అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తూ వచ్చాయని జగన్ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు.
కళ్ళ ముందు జరిగే అభివృద్ధిని కాదని అంటే ఏమి చేయగలమని? ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. అప్పుల విషయంలో కూడా చంద్రబాబు కంటే తానే బెటర్ అని, తక్కువ అప్పులు చేశాను అని స్పష్టం చేశారు. పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏ ఒక్క ఏడాది లోటు బడ్జెట్ లేకుండా ప్రభుత్వాన్ని నడపలేదని ఈ సందర్భంగా ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు హామీలు ఇవ్వడం తప్ప వాటిని నెరవేర్చే స్థితిలో ఎపుడూ ఉండరని, తాను ఎంతో కష్టపడి అయిదేళ్ల పాటు ఏపీలో అన్ని వర్గాల కోసం డెబ్బై వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్నానని చంద్రబాబు ఏకంగా లక్షా అరవై అయిదు వేల కోట్ల రూపాయల విలువైన హామీలు ఇచ్చారని, ఏటా ఈ పెనుభారం ఎలా భరిస్తామని ఆయన అన్నారు.