మోదీ ఒడిలోని కూర్చున్న ఆ బుడ్డోడు ఎవరబ్బా?

Suma Kallamadi
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావిడి సుస్పష్టంగా కనబడుతోంది. ఎక్కడ ఎన్నికలుంటే అక్కడికి ప్రధాని మోదీ వెళ్ళిపోయి తనదైన శైలిలో ప్రచారం షురూ చేస్తున్నారు. ఈ క్రమంలో బిజెపితో పాటు ఎన్డిఏ కూటమి మిత్రపక్షాల తరపున ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించిన మోడీ నిన్న తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సుడిగాలి పర్యటనలు చేయడం మనం చూసాం. ఈ క్రమంలోనే ప్రధానిని ఓ బుడ్డోడు తన బోసినవ్వుల చిరునవ్వుతో ఆకట్టుకున్నాడు. ఇంకేముంది కట్ చేస్తే, వాడిని మోడీ స్వయంగా ఎత్తుకుని ముద్దాడారు. కాగా ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు నాలుగో దశలో  ఎన్నికలు జరగనున్నాయి. మే 13న పోలింగ్ పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నిన్న(బుధవారం) కరీంనగర్, వరంగల్ లోక్ సభ పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ బిజెపి క్యాడర్ లో జోష్ నింపుతూ... కమలంపువ్వు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతూ ప్రధాని మోడీ ప్రచారం ప్రధానంగా సాగిందని చెప్పుకోవచ్చు. మొదట వేములవాడలో జరిగిన బిజెపి ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని రోడ్డుమార్గంలోనే వరంగల్ కు బయలుదేరారు. ఈ క్రమంలోనే మోదీని చూసేందుకు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు.
ఈ నేపథ్యంలో ఇలా లక్ష్మీపురంలో ఓ కన్నతల్లి తన చిన్నారి బిడ్డను తీసుకుని ప్రధానిని చూసేందుకు రోడ్డుపైకి వచ్చింది. తరువాత బిడ్డను ఎత్తుకుని తనను చూసేందుకు వచ్చిన ఆ తల్లిని చూసిన ప్రధాని మోదీ వెంటనే కాన్వాయ్ ఆపడం జరిగింది. తన కారుదిగి ఆ తల్లి వద్దకు వెళ్లి ఆ బుడ్డోడిని చేతుల్లోకి తీసుకున్నారు. చిన్నారిని ఎత్తుకుని కొద్దిసేపు ప్రేమగా ఆడించారు. ఆ బుడ్డోడు కూడా ప్రధానిని చూస్తూ పాలబుగ్గల నవ్వులు చిందించాడు. కాగా ఈ అందమైన దృశ్యం చూపరులను అమితంగా ఆకట్టుకుంది. ఏదిఏమైనా ఈ పిల్లాడికి మాత్రం అతడి ఒడిలో కూర్చుని ఆటాడుకునే అరుదైన అవకాశం దక్కడం నిజంగా అదృష్టం. అంతేకాదండోయ్... చిన్నారిని లాలిస్తున్న ఫోటోను స్వయంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకోవడం కొసమెరుపు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: