లాక్డౌన్పై మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు... లాక్డౌన్ ఉండదా....?
జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు రోజురోజుకు పెరిగిపోవడం, మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరగడంతో బుధవారం జరిగే కేబినెట్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రివర్గంలో ఇప్పటికే బేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఎలాంటి చర్చను లేవనెత్తుతారు. ఎలాంటి నిర్ణయాలు ఏం జరగబోతోందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం. లాక్డౌన్ తో ప్రయోజనం లేదని, ఇండ్లకే పరిమితమైతే పేదలు ఇబ్బంది పడతారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే మరికొంతమంది మంత్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా..ఇంకొంతమంది మాత్రం..పరిస్థితులు చేదాటిపోయిన తర్వాత అప్పుడు మనం చేయగలిగేది లేదు...కరోనా విజృంభిస్తే ప్రభుత్వంపై విమర్శలు వస్తాయని చెబుతున్నట్లు తెలుస్తోంది.
లాక్డౌన్ అమలు చేయకుంటే కరోనా పెరిగితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నట్లు చెప్పారు. అయితే లాక్డౌన్ అమలు చేయడం వలన చిరు వ్యాపారులతో పాటు వ్యాపార కేంద్రాలు మూత పడటం వలన పేదలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని కొంతమంది మంత్రులు అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాణ రంగానికి..ఇతర అభివృద్ధి పనులకు కూలీల లభ్యత కష్టంగా మారిందని,అందరూ ఊరి బాటపట్టారన్న వాదనను వినిపిస్తున్నారు. వైరస్తో కలిసి ఉండటం, స్వీయ నియంత్రణ పాటించడం తప్పా వేరే మార్గం లేదని వాదిస్తున్నారు. ఈనేపథ్యంలో ఈరోజు జరిగే మంత్రివర్గ బేటీలో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబుతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా తెలంగాణలో ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ ను జూలై 31వ తేదీ వరకు పొడగిస్తూ తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త లాక్ డౌన్ కు నూతన మార్గదర్శకాలను బుధవారం జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లకు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చింది. రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుండగా..మెడికల్ ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపునిచ్చింది. రాత్రి 9.30 గంటల లోపు అన్ని షాపులు మూసేయాలని..రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెప్పింది.