రేప్ గురించి హైకోర్టు సంచలన వ్యాఖ్య... నిజంగా అలా జరిగిందా?
గత కొద్దికాలంగా దారుణమైన అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నైతే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు, అత్యాచారాల విషయంలో కోర్టులు సంచలన తీర్పులు ఇస్తున్నాయి. అయితే, తాజాగా ఓ అత్యాచారం విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కర్ణాటకలోని ఓ వ్యక్తి తన వద్ద పని చేస్తున్న ఓ ఉద్యోగిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకున్నాడు. ఓ రోజు రాత్రి ఆమెను కారులో ఎక్కించుకొని ఆఫీసుకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి మందు సేవించారు. అనంతరం శారీరకంగా కలుసుకున్నారు. ఆ రాత్రంతా ఇద్దరు అక్కడే కలిసి నిద్రించారు.
కట్ చేస్తే, ఆమె పోలీసుల వద్దకు చేరింది. సదరు వ్యక్తి తనపై లైంగిక దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. అయితే, సదరు వ్యక్తి పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ ఈ పిటిషన్పై విచారణ జరిపారు. లైంగిక దాడి జరిగిందన్న ఆ మహిళ ఆరోపణలపై ఆయన పలు సందేహాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
లైంగిక దాడి ఘటన గురించి ఆమెను పలు ప్రశ్నలు అడిగారు. ``రాత్రి 11 గంటల వేళ పని చేసే కార్యాలయానికి అతడితో కలిసి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఆ వ్యక్తితో కలిసి మందు సేవించినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు? లైంగిక దాడిని ఎందుకు ప్రతిఘటించలేదు? అనంతరం రాత్రంతా అతడితో కలిసి అక్కడే ఎలా నిద్రించగలిగావు? ఫిర్యాదు చేయడానికి ఎందుకు ఆలస్యమైంది?`` అంటూ పలు ప్రశ్నలు సంధించడమే కాకుండా లైంగిక దాడికి గురైన ఏ భారతీయ మహిళ కూడా ఇలా ప్రవర్తించదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మరోవైపు సదరు ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తికి రూ.లక్ష పూచికత్తుపై ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అలాగే అనుమతి లేకుండా నగరం వీడిచి వెళ్లరాదని, ప్రతి నెల రెండు, నాలుగు శనివారాల్లో పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలని అతడిని ఆదేశించారు.