కేటీఆర్ మళ్లీ అదే పని చేసేశారుగా...లాక్ డౌన్ ఉన్నా తేడా లేదు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కే తారకరామారావు అవకాశం దొరికినప్పుడల్లా తమ ప్రభుత్వం గురించి, విధి విధానాల గురించి, గతంలో పాలనకు, ప్రస్తుత పరిపాలనకు మధ్య తేడా గురించి వివరిస్తుంటారు. సందర్భం ఏదైనా ఆయన తమ వాణిని వివిధ వర్గాలకు తెలియజేస్తుంటారు. కరోనా కలకలం నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించగా సైతం పలు రూపాల్లో వివిధ వేదికల్లో కేటీఆర్ ఈ ఒరవడిని కొనసాగించారు. తాజాగా కూడా అదే రీతిలో తమ విధానాలను ఆయన విశదీకరించారు. ఇన్ వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫోరం నిర్వహించిన ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ ఎడిషన్ వెబినార్లో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
ఈ కీలకమైన వెబినార్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది వ్యవసాయ, పుడ్ ప్రాసెసింగ్ పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ముఖ్యంగా రెడీ టు ఈట్, బేవరేజెస్, కాయగూరలు, పళ్ళు, పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తి లకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు తమకు ఆసక్తి ఉందని వాళ్ళు తెలిపారు. వీరిని ఉద్దేశించి మాట్లాడిన మంత్రి తారకరామారావు తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అగ్రస్థానంలో ఉందని తద్వారా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం అత్యంత సౌకర్యవంతమైన విషయమని వారికి తెలియజేశారు. ఇప్పటికే తెలంగాణ అనేక రంగాల్లో ప్రపంచ స్థాయి పరిశ్రమలను ఆకర్షించిందని, పుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనేక పెద్ద సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రారంభించిన నూతన ప్రాజెక్టులతో పెద్దఎత్తున సాగునీటి వనరులు అందుబాటులోకి వస్తాయని, తద్వారా వ్యవసాయ రంగంలో విభిన్న రకాలైన పంటలు, వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం రైతులను వరి లాంటి ఒకే పంట కాకుండా వివిధ రకాల పంటలు వేసేలా వారిని చైతన్య పరుస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అపూర్వమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జల విప్లవం కొనసాగుతుందని తద్వారా వ్యవసాయ రంగంతో పాటు పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తి, చేపల ఉత్పత్తుల ఈ విషయంలో గతంలో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున అవకాశాలు భవిష్యత్తులో ఏర్పడతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వీటి వలన ప్రాసెసింగ్ మరియు అగ్రికల్చర్ రంగాల్లో రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఇతర రంగాల్లోని అనేక పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం విజవంతంగా కొనసాగుతుందని, ఈ విషయంలో తెలంగాణ అగ్రపథంలో కొనసాగుతుందన్న మంత్రి కేటీఆర్ అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
వ్యవసాయ ఉత్పత్తులను లేదా ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉన్న విషయాన్ని కూడా మంత్రి కేటీఆర్ తెలియజేశారు. తెలంగాణలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రత్యేకంగా పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసిందని తెలియజేశారు. దీంతో పాటు రైతులను సంఘటిత పరిచే రైతుబంధు సమితులను కూడా ఏర్పాటు చేసిందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వానికి లేదా పరిశ్రమ వర్గాలకు అనుకూలంగా ఉంటుంద అన్నారు. స్థానికంగా ఉన్న పరిశ్రమలు లేదా ఇతర వర్గాలతో కలిసి వ్యాపారం నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సహకరిస్తుందని అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.