మోదీతో తేడా రావద్దని కేసీఆర్ ఏం చేస్తున్నారంటే...
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతుండంతో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటికే మూడు లక్షలు దాటింది. గత పది రోజుల వ్యవధిలో కేసులు రెండు లక్షల నుంచి మూడు లక్షలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 16, 17వ తేదీల్లో సీఎంలతో చర్చలు జరపనున్నారు. సీఎంలను రెండు గ్రూపులుగా విభజించి ప్రధాని చర్చించనున్నారు.
కరోనా కట్టడి, లాక్డౌన్ ఎత్తివేత అంశాలకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు సీఎంలను రెండు గ్రూపులుగా విభజించి ప్రధాని చర్చించనున్నారు. 16వ తేదీన 17 రాష్ర్టాల ముఖ్యమంత్రులతో, 17వ తేదీన 15 రాష్ర్టాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, 17వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానితో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ నుంచి పక్కా సమాచారం అందించేందుకు సన్నద్ధం అయ్యారు. ఈ నెల 16వ తేదీన ఆయన కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. దీంతో పాటుగా ఈ ఏడాది వ్యవసాయ సాగులో ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువస్తుండటంపై కూడా చర్చించనున్నారు. వానకాలంలో 40 లక్షల ఎకరాల్లో వరి పంట, 70 లక్షల ఎకరాల్లో పత్తి, 15 లక్షల ఎకరాల్లో కంది పంట సాగు చేయాలని నిర్ణయించారు. సోయాబిన్, పసుపు, మిర్చి పంటలను గత ఏడాది మాదిరిగానే పండించాలని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. ఈ మేరకు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమాలోచన చేయనున్నారు.
కాగా, దీనికంటే ముందే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో కరోనా పరిస్థితిపై సీనియర్ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడం ఎలా విషయంపై వారితో చర్చించారు. కరోనా విలయ తాండవం చేస్తున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీతోపాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్షా, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్తోపాటు ప్రధాని ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.