మే 30 ముహూర్తం: వైసీపీలోకి నలుగురు ఎమ్మెల్యేలు... పేర్లు ఇవే...!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా ఇటు వైపు మాత్రం రాజకీయం రోజు రోజుకు... గంట గంటకు హీటెక్కుతూనే ఉంది. అసలు కరోనా ప్రారంభ మయ్యాక కూడా ఏపీలో కరోనాను మించి రాజకీయాలు వేడెక్కేశాయి. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు... అధికార వైసీపీ దూసుకుపోతుండడం ఒక ఎత్తు అయితే.. సడెన్గా ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేయడం.. జగన్ దీనికి ట్విస్ట్ ఇస్తూ నిమ్మగడ్డను ఏకంగా పదవీ నుంచి తొలగిస్తూ జీవో ఇవ్వడం.. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన కనగరాజ్ను ఎన్నికల అధికారిగా తెచ్చుకోవడం లాంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి.
ఇక రాజకీయంగా కూడా చంద్రబాబును జగన్ చాలా వ్యూహాత్మకంగా దెబ్బ కొడుతూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో వల్లభనేని వంశీ మోన్, కరణం బలరాం, మద్దాలి గిరి టీడీపీకి దూరమయ్యారు. ఇక బాలయ్య, చంద్రబాబును పక్కన పెడితే ఆ పార్టీకి ఇప్పుడు కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వినపడుతోంది. టీడీపీకి ఉన్న ఈ 18 మంది ఎమ్మెల్యేల్లో మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడేందుకు ముహూర్తం రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ నలుగురు ఎమ్మెల్యేల్లో ముందు నుంచి అనుమానాలు ఉన్న ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.
ఆయన గతంలో వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అదే జిల్లాకు చెందిన కొండపి ఎమ్మెల్యే డోలా బాలా శ్రీ వీరాంజనేయ స్వామి పేరు కూడా వినపడుతోంది. ఆయన కూడా టీడీపీలో ఇమడ లేకపోతున్నారట. స్వామి టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎస్సీ ఎమ్మెల్యే కావడం విశేషం. ఇక అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పేరు కూడా జంపింగ్ లిస్టులో ఉంది. మరో విశేషం ఏంటంటే ఉత్తరాంధ్రలోని వైజాగ్కు చెందిన విశాఖ నగర ఎమ్మెల్యేలు గణబాబు, వాసుపల్లి గణేష్ లపై కన్నేసిన వైసీపీ వారిని కూడా పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. వీరంతా ఈ నెల 30న పార్టీ మారేందుకు ముహూర్తం పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజుకు యేడాది అవుతుంది. అందుకే జగన్ ఆ రోజు బాబోరికి బిగ్ షాక్ ఇస్తారని అంటున్నారు.