పోతిరెడ్డిపాడు పై పోరాటం లో బీజేపీ కి కొత్త ఇబ్బంది
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపు , ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ తరలించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ కమలనాథులు స్వాగతిస్తుండగా , తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ బీజేపీ నాయకత్వం డిమాండ్ చేస్తోంది . ఈ మేరకు ఇప్పటికే ఒకరోజు నిరసన దీక్ష కూడా చేపట్టింది .
తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ ను ఇరకాటంలోకి నెట్టాలని భావిస్తోన్న బీజేపీ నేతలకు , ఏపీ ప్రాంత బీజేపీ నేతల వ్యవహారశైలి తలనొప్పులు తెచ్చిపెడుతోంది . పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపు పై , ఏపీలోని విపక్షాలు తమ వైఖరిని స్పష్టం చేయకముందే , రాయలసీమ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ విధాన నిర్ణయం కంటేముందుగానే, జగన్ ప్రభుత్వ నిర్ణయానికి జైకొట్టారు . అన్ని రాజకీయపార్టీలు ఈ నిర్ణయాన్ని సమర్ధించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు . విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటన తరువాత రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా చేసేదిలేక ప్రభుత్వ నిర్ణయానికి దన్నుగా నిలువాలని నిర్ణయించినట్లు స్పష్టం అవుతోంది .
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపును తెలంగాణలో ఒక్క బీజేపీనే కాకుండా , మిగతా రాజకీయ పక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి . ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కృష్ణానదీ యాజమాన్య బోర్డు , అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లి , అడ్డుకోవాలని ఫిర్యాదు చేసింది. అయితే తెలంగాణ లో టీఆరెస్ నాయకత్వాన్ని ఆత్మరక్షణ లోకి నెట్టాలని పోతిరెడ్డిపాడు వ్యవహారంపై దూకుడుగా వ్యవహరించిన కమలదళం , తమ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించలేక , విభేదించలేక ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది.