అమెరికాపై కరోనా పగబట్టిందా..?
కరోనా వైరస్ అమెరికాను పట్టి పీడిస్తోంది. ఇప్పటికే అగ్రరాజ్యంలో 12 లక్షల మందికి సోకగా.. దాదాపు 70 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే.. రోజువారీ నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడం. అయితే ఆగస్ట్ నాటికి కోవిడ్ మరణాల సంఖ్య కనీసం లక్షా 35వేలకు చేరుకుంటుందని అంచనా.
అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో వ్యాపారాలకు సంబంధించిన కార్యకలాపాలు, ఇంటి వద్దే ఉండటంపై ఉన్న ఆంక్షలు ఈనెల రెండో వారం నాటికి ముగియనున్నాయి. ఆంక్షల ఎత్తివేత తర్వాత వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్, ఎవాల్యువేషన్ అంచనా వేసింది. ఈ వేసవికాలంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగే అవకాశం ఉందని అంచనా. అయితే అమెరికా ప్రభుత్వం తీసుకునే చర్యలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడే అవకాశం ఉందని.. అదే తరుణంలో మానవ జీవనంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆగస్ట్ తొలివారం నాటికి కనీసం 95వేల నుంచి గరిష్ఠంగా 2లక్షల 42వేల మరణాలు సంభవిస్తాయని అంచనా. మధ్యస్తంగా లక్షా35వేల మంది మృత్యువాత పడతారని ఐహెచ్ఎమ్ఈ చెబుతోంది. ఇదే సంస్థ గత నెల 29న విడుదల చేసిన నివేదికలో 72వేల మరణాలు మాత్రమే ఉంటాయని అంచనా వేసింది. ప్రస్తుతం రోజుకు దాదాపు 2వేల మంది చనిపోతుండగా మే చివరినాటికి ఇది మూడు వేలకు చేరుతుందని అమెరికా అధ్యక్ష వ్యవహారాల విభాగం వేసిన అంచనాతో ఐహెచ్ఎమ్ఈ నివేదిక దగ్గరగా ఉంది.
కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా వైరస్ కు అంతం ఎప్పుడో ఉంటుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఖచ్చితంగా ఫలానా టైమ్ అని చెప్పలేకపోయినా అంచనా అయితే వేస్తున్నారు.