అమ్మా శబరీ.. పారాసిట్మాల్ రాజకీయాలెందుకు తల్లి...!
బైరెడ్డి శబరి. కర్నూలు జిల్లా రాజకీయాల్లో కొన్నాళ్లుగా వినిపిస్తున్న పేరు ఇది. బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె గా ఆమె గుర్తింపు పొందారు. గతంలో అంటే రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక సీమ కావాలంటూ .. రాజశేఖ రరెడ్డి రోడ్డెక్కడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ఈ సమయంలో తెరమీదికి వచ్చిన శబరి.. రాజకీయాల్లో దూకుడు చూపించాలని అనుకున్నారు. అయితే, ఇది సాధ్యం కావడం లేదు. దీంతో ఏదో ఒక అంశంతో ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్నారు. పైగా తన బాబాయి కుమారుడు బైరెడ్డి సిద్ధార్త రెడ్డి రాజకీయాల్లో దూకుడుగా దూసుకుపోతుంటే.. ఆయనతోపోటీ పడాలని ఆమె ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏ విషయం అందుబాటులోకి వస్తే.. ఆ విషయాన్ని పట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ప్రస్తు తం బీజేపీలో ఉన్నా.. ఆశించిన స్థాయిలో ఆమెకు గుర్తింపు రావడం లేదు. దీంతో ఎలాగైనా సరే మీడియాలో కనిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి. తాజాగా కరోనా గురించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్య లను పట్టుకుని శబరి రాజకీయాలు చేస్తున్నారు. తప్పుని తప్పని చెబితే వైసీపీ నేతలు తనను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా నియంతృత్వమా.. రాష్ట్రంలో అసలేం జరుగుతుందని ప్రశ్నించారు.
ఓ వీడియో రిలీజ్ చేసిన శబరి.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘‘తప్పుడు సమాచారం వస్తే.. డాక్టర్గా దాన్ని సరిచేయాల్సిన బాధ్యత నాకుంది. పారాసిటమాలే ట్రీట్మెంట్ అని సీఎం చెబుతున్నారు. అది జ్వరాన్ని మాత్రమే తగ్గిస్తుంది. ఈ కరోనా వైరస్ అంటే జ్వరం మాత్రమే కాదు. వేరే ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ఇదే విషయాన్ని చాలా మర్యాదగా చెప్పాను. నేను ముందుకు వచ్చి మాట్లాడటం తప్పా... తప్పు జరిగితే ప్రశ్నించకూడదని ఏమైనా చెప్పారా? ఆరు గంటలకొకసారి 650 గ్రాముల చొప్పున అంటే 24 గంటల్లో దాదాపు 2.5 కేజీల పారాసిటమాల్ వేసుకోవాలి. ఇదేమైనా స్వీటా? మంచిది కాదు.
పెద్ద స్థాయిలో ఉన్న మీలాంటి వారు చెబితే.. ప్రజలు గుడ్డిగా నమ్ముతారు. ఇంతవరకు నేను రాజకీయం చేయలేదు. ప్రజల కోసం ముందుకు వచ్చి మాట్లాడా. గౌరవంగా.. బాధ్యతాయుతంగా మాట్లాడా’’ అన్నారు. అయితే, శబరి వీడియోపై నెటిజన్లు సటైర్లు కుమ్మేస్తున్నారు. అమ్మా శబరీ.. నీకు పారాసిట్మాల్ రాజకీయాలు ఎందుకమ్మా? అని ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా.. కీలకమైన విషయాలు వదిలేని పారాసిట్మాల్ రాజకీయాలు ఎందుకని అంటున్నారు.