కరోనా ఉందని ఖైదీలను విడుదల చేశారు... దీంతో ఏకంగా 54000 మందికి...
చైనాలో కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య దాదాపు మూడు వేలకు చేరుకుంది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3200 దాటింది. వైరస్ సోకిన వారి సంఖ్య 92వేలు దాటింది. ఇలాంటి సమయంలో ప్రతి దేశం అలర్ట్ అవుతోంది. తాజాగా ఇరాన్లో కరోనా వైరస్ కేసులు సుమారు 2300 దాటాయి. ఆ దేశంలో దాదాపు 77 మంది మరణించారు. ఇరాన్కు చెందిన చట్టసభ ప్రతినిధుల్లో సుమారు 8 శాతం మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టాలన్న ఉద్దేశంతో.. తాజాగా ఆ దేశం 54 వేల మంది ఖైదీలను రిలీజ్ చేసింది.
ఇరాన్లోని కిక్కిరిసిన జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. కోవిడ్19 పరీక్షలో నెగటివ్గా తేలిన ఖైదీలను జైలు నుంచి రిలీజ్ చేస్తున్నట్లు ఆ దేశ న్యాయప్రతినిధి గోలమ్హోసన్ ఇస్మాయిలీ తెలిపారు. అయితే అయిదేళ్ల కన్నా ఎక్కువ కాలం శిక్ష పడిన వారిని మాత్రం విడుదల చేయడం లేదు.
కాగా, కరోనాపై పోరాటం చేస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు .. వరల్డ్ బ్యాంక్ సుమారు 12 బిలియన్ల డాలర్లు సాయం అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ ప్యాకేజీ తరహాలో వరల్డ్ బ్యాంక్ ఆయా దేశాలకు ఆ డబ్బును ఖర్చు చేయనున్నారు. తక్కువ వడ్డీతో రుణాలు, గ్రాంట్లు, టెక్నికల్ సహకారం అందించేందుకు కూడా వరల్డ్ బ్యాంక్ సిద్దమైంది. కరోనా వ్యాప్తితో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు వరల్డ్ బ్యాంక్ భారీ రుణ సాయానికి సిద్దమైంది. తాము ఇచ్చే నిధులతో అభివృద్ధి చెందుతున్న దేశాలు.. పబ్లిక్ హెల్త్ వ్యవస్థను పటిష్టం చేయాలని వరల్డ్ బ్యాంక్ పేర్కొన్నది. అత్యంతపేద దేశాలను ఎంపిక చేసి.. నిధులను చేరవేస్తామని వరల్డ్ బ్యాంక్ చెప్పింది.