పవన్ ను బజారుకీడుస్తుంది వారేనా ? క్రిమినల్ కేసులు పెట్టబోతున్న జనసేన
ఇంటా బయట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు పెరిగిపోతున్నాయి. పవన్ కు పార్టీ నడిపించే సత్తా లేదని, ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు నడుచుకునే వ్యక్తి అని, అసలు సొంత అజెండా లేదని, పవన్ అసలు రాజకీయాలకు పనికిరాడు అని ఇలా ఎన్నో రకాలుగా ఆయనపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. జనాల్లో పవన్ పై ఎటువంటి అభిప్రాయం ఉన్నా రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ తరహా అనుమానాలు ఉన్నాయి. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పవన్ తో పాటు ఆ భర్తీలో ఒక్క అభ్యర్థి మినహా అంతా ఓటమి చెందినా పవన్ పై విమర్శలు ఆగలేదు.
ఇక బీజేపీతో జనసేన పొత్తు పట్టుకోవడానికి సంబందించిన చర్చల దగ్గర నుంచి ప్రతి చిన్న విషయమూ జనాల్లోకి వేల్లోపోవడం, పవన్ పై విమర్శలు రావడం సర్వ సాధారణం అయిపొయింది. అసలు కొన్ని సీక్రెట్ గా ఉండాల్సి విషయాలు కూడా బయటకి వచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం జనసేన వర్గాలకు మింగుడుపడడంలేదు. అయితే దీనిపై ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన జనసేన పార్టీ, అసలు ఇటువంటి తరహా ప్రచారాలు ఏ విధంగా వస్తున్నాయి అనేది ఆరా తీసింది.
జనసేన పార్టీలో ఉండి బయటకు వెళ్లిపోయిన నాయకులే జనసేన పార్టీ గురించి, అధినేత పవన్ కళ్యాణ్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లుగా జనసేన పార్టీ లీగల్ సెల్ గుర్తించింది. ఇటువంటి వారి విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ మెతగ్గా ఉండకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని జనసేన పార్టీ భావిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో, ఫేస్బుక్, వాట్సాప్ పోస్ట్ లు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్న వారిపైన క్రిమినల్ కేసులు పెట్టేందుకు జనసేన పార్టీ సిద్ధమవుతోంది. కొంతమంది వ్యక్తులను ఇప్పటికే గుర్తించినట్లుగా ఆ పార్టీ ప్రకటించింది.