రాజధానిపై నాన్చుడు వెనుక జగన్ వ్యూహం ఇదేనా..?
రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూసిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో జగన్ మరోసారి ప్రజలకు షాక్ ఇచ్చారు. ఇ విశాఖను రాజధానిగా ప్రకటించడమే తరువాయి అని అంతా అనుకున్నసయమంలో అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోకుండానే… కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఏపీ భవిష్యత్ ఏమవుతుంది. ఏపీ రాజధాని విషయంలో కేబినెట్ ఏం నిర్ణయం తీసుకుంటుందా అని ప్రజలంతా ఎదురు చూశారు. అమరావతి రాజధానిగా ఉంటుందా.. ఉండదా.. విశాఖ రాజధాని అవుతుందా.. హైకోర్టు సంగతి ఏంటి.. హైకోర్టు బెంచులు ఎక్కడ ఎక్కడ ఉంటాయి. ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనే అంశంపై రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
అయితే.. రాజధాని అంశంపై నిర్ణయం కోసం జగన్ మరో కమిటీ వేశారు. హైపవర్ కమిటీ ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాన్ని మంత్రిమండలి నిర్ణయించింది. మరి ఎందుకు ఇంకా జగన్ నాన్చారు.. ఇందుకు అనేక వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని ప్రాంత రైతుల సమస్యను సావధానంగా పరిష్కరించి..వారిని శాంతింపజేసిన తర్వాత విశాఖను రాజధానిగా ప్రకటిస్తే బావుంటుందన్న ఆలోచన కారణంగానే జగన్ ఇలా చేసినట్టు తెలుస్తోంది.
ఒక ప్రాంతం ఆందోళనల మధ్య రాజధాని ప్రకటన కాకుండా.. వారిని మానసింకగా ప్రిపేర్ చేసిన తరవాత రాజధాని మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విశాఖ రాజధాని అన్న విషయంలో ఎలాంటి అనుమానం లేకపోయినా.. ఆ మార్పు ప్రక్రియ సాఫీగా సాగేలా చేయాలన్నదే జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అసలు అసలు కేబినెట్ మీటింగ్ లో ఏం జరిగింది.. సమగ్ర రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం అంశాలను పరిశీలన కోసం ఏర్పాటు చేసిన జీఎన్రావు కమిటీ రిపోర్టును మంత్రిమండలికి ప్రభుత్వం అందజేసింది.
కమిటీలో జీఎన్రావు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, వారితో పాటుగా అర్బన్ డెవలప్మెంట్లో, మాస్టర్ ప్లాన్ తయారు, నగరాలను రూపొందించడంలో నిపుణులను కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేసుకొని అధ్యయనం చేయడం జరిగింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంచే ప్రపంచ ప్రఖ్యాత గాంచిన కంపెనీల్లో ఒకటైనా బోస్టన్ గ్రూపుతో కమిటీ వేయడం జరిగింది. ఆ సంస్థ రిపోర్టు ఇంకా ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. ఆ రిపోర్టు కూడా వచ్చాక హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుటుంది.